Telangana
oi-Bomma Shivakumar
తెలంగాణ రాష్ట్రంలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఓవైపు పదే పదే చెబుతున్నా వాహనదారులు మాత్రం ట్రాఫిక్ పోలీసుల మాటలను పట్టించుకోవడం లేదు. దాంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయి. రాంగ్ రూట్ లో వెళ్లడం, లైసెన్స్ లేకుండా, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం, మద్యం తాగి వాహనాలు నడపడం తదితర నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఇందుకు గానూ వారిపై ట్రాఫిక్ చలాన్లు పెరిగిపోతున్నాయి. కానీ వాహనదారులు మాత్రం చలాన్లు పడుతున్నా, వాటిని కట్టకుండా నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు. అయితే రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలానాలను వసూలు చేసేందుకు పోలీసులు.. వాహనదారులకు కొన్నిసార్లు రాయితీలు ప్రకటిస్తుంటారు.
అయితే తాజాగా ఓ ఫేక్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. “మార్చి 14న లోక్ అదాలత్ లో 80శాతం డిస్కౌంట్ తో మీ వాహనంపై చలానాలను క్లియర్ చేసుకోవచ్చంటూ కొందరు నెట్టింట వీడియోలను పోస్టు చేస్తున్నారు. ఈ వైరల్ వీడియోలపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఘాటుగా స్పందించారు. వీడియోను తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశారు. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.
ఫేక్ న్యూస్ అలర్ట్!
సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కక్కుర్తితో కొందరు ఎంతకైనా దిగజారుతున్నారు. మార్చి 14న లోక్ అదాలత్ సందర్భంగా ట్రాఫిక్ చలానాలపై రాయితీలు అంటూ ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఆశ్చర్యకరం ఏంటంటే.. ఈ ఫేక్ సమాచారం వీడియోలకు ఏకంగా లక్షల్లో వ్యూస్ రావడం.… pic.twitter.com/wrZ9znN6qe
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 1, 2026
“ఫేక్ న్యూస్ అలర్ట్!.. సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కక్కుర్తితో కొందరు ఎంతకైనా దిగజారుతున్నారు. మార్చి 14న లోక్ అదాలత్ సందర్భంగా ట్రాఫిక్ చలానాలపై రాయితీలు అంటూ ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఆశ్చర్యకరం ఏంటంటే.. ఈ ఫేక్ సమాచారం వీడియోలకు ఏకంగా లక్షల్లో వ్యూస్ రావడం. ఇది పూర్తిగా అవాస్తవం. పోలీస్ శాఖ అధికారికంగా ఎలాంటి రాయితీలను ప్రకటించలేదు. దయచేసి ఇలాంటి ఫేక్ వీడియోలను నమ్మకండి.. ఇతరులకు షేర్ చేయకండి. సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టించి, ప్రజలను తప్పుదోవ పట్టించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవు!” అని ఎక్స్ వేదికగా సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు.
మరోవైపు ట్రాఫిక్ పోలీసులు రోజువారీ టార్గెట్ల కోసం ఇష్టానుసారంగా చలాన్లు విధిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. మల్కాజ్ గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో వారం రోజుల్లోనే రాంగ్ సైడ్ డ్రైవింగ్ కు 10వేలకు పైగా కేసులు నమోదు చేశారు. ప్రతి రోజూ 11 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 1,440 వరకు చలాన్లు విధిస్తున్నట్లు సమాచారం. అయితే ట్రాఫిక్ రద్దీని తప్పించుకోవడం కోసం కొందరు వాహనదారులు రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.


