India
oi-Kishore Kumar
కడలూరు జిల్లాలో ఇటీవల వెలుగుచూసిన సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పెళ్లైన కేవలం రెండున్నర నెలలకే నవవధువు ఎనిమిది నెలల గర్భవతి అని తెలియడంతో భర్త షాక్కు గురయ్యాడు. దీనిపై సదరు భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణలో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి.
కడలూరు జిల్లాకు చెందిన 25 ఏళ్ల రమేష్కి (పేరు మార్చబడింది), అదే జిల్లాకు చెందిన 18 ఏళ్ల కావ్యతో (పేరు మార్చబడింది) సెప్టెంబర్ 4న పెద్దల అంగీకారంతో వివాహం జరిగింది. వివాహం అనంతరం వారు ఆనందంగా జీవిస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో కావ్య తన భర్తతో తరచు కడుపునొప్పి వస్తుందని చెప్పేది. ఆ తర్వాత వైద్యుడిని సంప్రదించాలని రమేష్ ఆమెకు సూచించాడు.
ఒకరోజు ఇద్దరూ కలిసి సమీపంలోని ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు చెప్పిన మాటలు విని రమేష్ తీవ్రంగా కలత చెందాడు. కావ్య ఎనిమిది నెలల గర్భవతి అని వైద్యులు ధృవీకరించడంతో, రమేష్ నిశ్చేష్టుడయ్యాడు. పెళ్లై రెండున్నర నెలలే అయిన తన భార్య ఎలా గర్భం దాల్చిందని అతను దిగ్భ్రాంతికి గురయ్యాడు. దీనిపై కావ్యను ప్రశ్నించగా, తనకు ఏమీ తెలియదని బదులిచ్చింది.
దీంతో రమేష్ తన భార్య గర్భానికి కారణమైన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో కావ్య తల్లిదండ్రుల పెంపకంలో ఉన్న మామయ్య గణేష్ (పేరు మార్చబడింది) ఈ ఘటనకు కారణమని తేలింది.
గణేష్ తరచుగా మూర్ఛ వ్యాధితో బాధపడుతుండటంతో తన అక్క ఇంట్లోనే ఉండేవాడు. ఈ అవకాశాన్ని వాడుకుంటూ, అక్క ఇంట్లో లేని సమయంలో గణేష్ కావ్య పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. మాయమాటలు చెప్పి ఆమెతో పలుమార్లు లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. ఈ కారణంగానే కావ్య గర్భవతి అయినట్లు తేలింది.
పోలీసులు గణేష్ను విచారించడానికి వెళ్ళగా, మూడు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో అతను కోమాలోకి వెళ్లి చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. ఈ సంఘటన కడలూరు జిల్లాలో సంచలనం సృష్టించింది.


