Andhra Pradesh
oi-Dr Veena Srinivas
మొయినాబాద్ లో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్స్ పార్టీ తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది. ఈ డ్రగ్స్ పార్టీలో ఏలూరు టిడిపి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఉండడం ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశమైంది. మొదట పుట్ట మహేష్ కుమార్ యూరిన్ శాంపిల్స్ లో డ్రగ్స్ నెగిటివ్ రాగా, బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది.
చంద్రబాబుకు తలనొప్పిగా మారిన టీడీపీ ఎంపీ వ్యవహారం
ఇప్పుడు డ్రగ్స్ తీసుకున్న ఏలూరు ఎంపీ, అందులోనూ అధికార టిడిపి ఎంపి పుట్ట మహేష్ కుమార్ వ్యవహారం చంద్రబాబుకు తలనొప్పిగా తయారైంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో వైఫల్యాలను అడుగడుగునా వైసిపి నాయకులు టార్గెట్ చేస్తున్నారు. ఇక ఈ తాజా వ్యవహారం వైసీపీ చేతికి అస్త్రాన్ని అందించినట్టుగా తయారైంది. వైసిపి నాయకులు టిడిపిని టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.
టీడీపీ తెలుగు డ్రగ్స్ పార్టీ అంటూ వైసీపీ టార్గెట్
ఏపీ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేస్తామని చెబుతున్న కూటమి ప్రభుత్వం, తమ ప్రభుత్వం లోనే ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్న డ్రగ్స్ ఎంపీ పైన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని గుర్తు చేస్తుంది. టిడిపి పేరును తెలుగు డ్రగ్స్ పార్టీగా మార్చాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శిస్తోంది. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ డ్రగ్స్ సేవిస్తూ పోలీసులకు దొరకడం రాష్ట్ర ప్రజలకు సిగ్గుచేటని, ఆయన ఎంపీగా కొనసాగే అర్హత లేదని వైసిపి నేతలు మండిపడుతున్నారు.
చంద్రబాబుకు వైసీపీ డిమాండ్
సీఎం చంద్రబాబుకు దమ్ముంటే తక్షణమే పుట్ట మహేష్ ను టిడిపి నుండి బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల కూడా, చంద్రబాబు తక్షణం పుట్ట మహేష్ కుమార్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొయినాబాద్ డ్రగ్స్ పార్టీలో ఏలూరు టిడిపి ఎంపీ దొరకడం సిగ్గుచేటు అన్నారు.
చంద్రబాబు ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని షర్మిల ప్రశ్న
ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే ఎంపీ ఇక్కడ కొకైన్ తో విందులు చిందులు చేస్తున్నాడని, ఇది ఎక్కడి బాధ్యతారాహిత్యం అంటూ వైయస్ షర్మిల టార్గెట్ చేశారు. డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిన తర్వాత చంద్రబాబు ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని షర్మిల నిలదీశారు. డ్రగ్స్ తీసుకున్న ఎంపీ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని, యువత డ్రగ్స్ వాడాలని నేరుగా ప్రోత్సహిస్తున్నారా అంటూ ఆమె ప్రశ్నించారు.
కఠిన చర్యల దిశగా చంద్రబాబు
పుట్ట మహేష్ పైన అనర్హత వేటు వేయాలని, పార్టీ నుండి వెంటనే సస్పెండ్ చేయాలని పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్న వేళ, తెలుగుదేశం పార్టీకి ఇది పెద్ద తలనొప్పిగా మారింది. గతంలో అవినీతి, నేరారోపణలు ఎదుర్కొన్న నేతల పైన చంద్రబాబు చర్యలు తీసుకున్న నేపథ్యం ఉన్న క్రమంలో, పుట్టా మహేష్ కుమార్ పై టీడీపీ కఠిన చర్యలకు సిద్ధమైంది.
ఉపేక్షించేది లేదు.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చంద్రబాబు ఆదేశం
ఈ క్రమంలోనే ఏలూరు ఎంపి పుట్టా మహేష్ పై వచ్చిన ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు డ్రగ్స్ వంటి ఘటనలో ఎవరు ఉన్న ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. ఘటన పైన వివరణ కోరుతూ నోటీసులు ఇవ్వాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కు చంద్రబాబు ఆదేశించారు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన అంశంపై నివేదిక ఇవ్వాలని, వ్యక్తులు, నేతలు తప్పులకు పార్టీ నష్టపోయే పరిస్థితి రానివ్వనని చంద్రబాబు పేర్కొన్నారు.


