Andhra Pradesh
oi-Sai Chaitanya
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి వర్సస్ వైసీపీ రాజకీయ లెక్కల్లో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. 2029 ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటి రెండు వైపులా వ్యూహాలు అమలు చేస్తున్నారు. మరో సారి పాదయాత్రకు జగన్ సిద్దం అవుతున్నారు. ఇక వైసీపీకి అధికారం సాధ్యం కాదని కూటమి నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ పైన మాజీ సీఎం జగన్ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు చేసిన ట్వీట్ లో తన మనసులో మాట బయట పెట్టారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
మాజీ సీఎం జగన్ ఏపీలోని కూటమి ప్రభుత్వం పైన రాజకీయంగా పోరాటం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం పైన తక్కువ కాలంలోనే ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని పదేపదే చెబుతున్నారు. అటు కూటమి నేతలు 15 ఏళ్ల పాటు తామే అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగన్ వచ్చే ఎన్నికల కోసం కొత్త లెక్కలు సిద్దం చేస్తున్నారు. ఈ ఏడాదిలో పార్టీ ప్లీనరీ.. ఎన్నికల ముందు పాదయాత్రకు సిద్దం అవుతున్నారు. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం పైన విమర్శల తీవ్రత పెంచారు. నియోజకవర్గాల ఇంఛార్జ్ ల నియామకం పైనా కసరత్తు చేస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన ఖాయం అంటున్న వేళ అటు కూటమి.. ఇటు వైసీపీ అలర్ట్ అవుతున్నాయి. ఈ సమయంలోనే ప్రధాని మోదీ పైన జగన్ ప్రశంసలు కురిపించారు. ప్రధానిగా 8,931 రోజులు పూర్తి చేసుకోవటంపై అభినందనలు తెలిపారు.
జగన్ ట్వీట్ వైరల్..
ప్రధాని మోదీ ప్రజాసేవలో అంకిత భావంతో పని చేస్తున్న నేతగా కొనియాడారు. ఒక చారిత్రక మైలు రాయిని అధిగమించటం మోదీ పట్టుదల, సంకల్పానికి నిదర్శనంగా జగన్ పేర్కొన్నారు. దేశ సేవలో ప్రధానికి మరింత శక్తి, ఆయురాగ్యాలు కలగాలని జగన్ ఆకాంక్షించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా.. మూడో సారి ప్రధానిగా మోదీ గతంలో కొనసాగిన ప్రభుత్వాధినేతల రికార్డులను తిరగరాసారు. కాగా.. ఇప్పుడు జగన్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ లక్ష్యంగా జగన్ విమర్శలు కొనసాగిస్తున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధికే వైసీపీ మద్దతు ప్రకటించింది. తాజాగా జరిగిన స్పీకర్ అవిశ్వాస తీర్మాన చర్చ సమయం లోనూ వైసీపీ ఎంపీలు స్పీకర్ కు అనుకూలంగా నిలిచారు. ఇక.. ఇప్పుడు జగన్ చేసిన ట్వీట్ పైన సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


