India
oi-Chandrasekhar Rao
నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఏప్రిల్ 9వ తేదీన కేరళ, అదే నెల 23వ తేదీన తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఒకేదశలో ఇవి ముగుస్తాయి. మే 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఈ వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నికలు ఎదుర్కొంటోన్న నాలుగు రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ కూడా ఉంది. ఈ రాష్ట్రంతో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరీ ఉన్నాయి.
ఈ పరిణామాల మధ్య ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ పేరు తెరమీదికి వచ్చింది. గతంలో నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ లో క్రియాశీలకంగా వ్యవహరించారాయన. తృణమూల్ కాంగ్రెస్ విజయం కోసం పని చేశారు. తన సొంత రాష్ట్రం బీహారే అయినప్పటికీ- పశ్చిమ బెంగాల్ లో ఓటర్ జాబితాలో తన పేరును సైతం నమోదు చేసుకున్నారు.
అప్పట్లో మెజారిటీ సర్వేలు, ఇతర ఎగ్జిట్ పోల్స్ భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టినప్పటికీ.. ఆయన మాత్రం తృణమూల్ కాంగ్రెస్ వైపు నిలిచారు. పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ హ్యాట్రిక్ కొట్టబోతోన్నారని ప్రకటించారు. దీనికి సంబంధించిన ఓ ట్వీట్ ను ఎన్నికల ఫలితాలు వెలువడేంత వరకూ తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పిన్ చేసి ఉంచారంటే ఆయన కాన్ఫిడెన్స్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంచనాలకు మించి సీట్లు లభిస్తాయని ప్రకటించారు. దీనికి అనుగుణంగానే నాటి ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయఢంకా మోగించింది.
అలాంటి ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఆబ్సెంట్ అయినట్టే కనిపిస్తోంది. బీహార్ లో జన్ సురాజ్ పార్టీని స్థాపించిన అనంతరం రాజకీయ వ్యూహకర్త అనే ట్యాగ్ ను తొలగించుకున్నారు. పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు సాగిస్తోన్నారు. గత ఏడాది జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చుక్కెదురైంది.. జన్ సురాజ్ పార్టీకి. ఒక్క సీట్ ను కూడా గెలుచుకోలేకపోయింది. చాలాచోట్ల డిపాజిట్లు కూడా దక్కలేదు.
దీని తర్వాత రాజకీయ వ్యూహాలకు దాదాపుగా స్వస్తి చెప్పారు. పార్టీ కోసం క్రియాశీలకంగా వ్యవహరిస్తోన్నారు. తమిళనాడులో విజయ్ స్థాపించిన టీవీకేతో కలిసి పని చేయొచ్చంటూ మొదట్లో వార్తలొచ్చాయి. స్వయానా ఆ పార్టీ వ్యవస్థాపక దినోత్సవానికీ హాజరయ్యారు ప్రశాంత్ కిశోర్. ఆ తర్వాత పెద్దగా సంప్రదింపులు జరిగినట్లు సమాచారం లేదు. ఎన్నికల ఫలితాలు ఎలా రావాలనేది రాజకీయ వ్యూహకర్తల చేతుల్లో ఉండబోదని, పార్టీ నాయకులు, కార్యకర్తల అంకితభావం మీదే ఆధారపడి ఉంటుందని అన్నారు.
వ్యూహకర్తలకు జయాపజయాలతో ఎలాంటి సంబంధం ఉండదని, అంతా నాయకులు, కార్యకర్తలు చేసే పనులతో ముడిపడి ఉంటుందని వ్యాఖ్యానించారు. నాలుగు సంవత్సరాల కిందటే అంటే 2021లోనే వ్యూహకర్తగా రిటైర్మెంట్ ప్రకటించానని తేల్చి చెప్పారు ప్రశాంత్ కిశోర్. చివరిసారిగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పని చేశానని గుర్తు చేశారు.


