India
-Bomma Shivakumar
జన్ సురాజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రెండున్నర నెలల రాజకీయ విరామం తర్వాత తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. ఆదివారం బగాహా నుంచి ‘బీహార్ నవ నిర్మాణ్ అభియాన్’ ను లాంఛనంగా ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి అనంతరం బరిలోకి దిగిన ఆయన, రాబోయే ఐదేళ్లలో పార్టీ సంస్థను పటిష్టం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
బగాహాలోని ఐబీ గెస్ట్హౌస్లో జరిగిన కార్యకర్తల సదస్సులో ప్రశాంత్ కిషోర్ రాష్ట్ర డబుల్ ఇంజిన్ ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల వేళ విద్య, ఉపాధి వంటి ప్రాథమిక సమస్యలను తాను లేవనెత్తినా, ప్రభుత్వం ఆర్థిక ప్రలోభాలతో ప్రజలను తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు. మహిళలకు రెండు లక్షల హామీపైనా ప్రశ్నిస్తూ, ఇప్పుడు దాని అమలుపై జవాబు అడుగుతున్నారని తెలిపారు.
ఆర్జేడీ- కాంగ్రెస్ విభేదాలపై ప్రజలే ఎన్నికల ద్వారా అన్ని పార్టీల పాత్రలను నిర్ణయించారని కిషోర్ స్పష్టం చేశారు. ఎన్డీఏకు పాలన, ఆర్జేడీకి ప్రతిపక్షం, జన్ సురాజ్ కు ప్రజా సమస్యలపై పనిచేసే బాధ్యత లభించిందని ఆయన వివరించారు.
‘బీహార్ నవ నిర్మాణ్ అభియాన్’ లో భాగంగా.. ప్రశాంత్ కిషోర్ ప్రతి జిల్లాలో 1-2 రోజులు ఉండి గ్రామాల్లో పర్యటిస్తారు. కార్యకర్తలు, ప్రజలతో నేరుగా సంభాషిస్తారు. సంస్థను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి, ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడం ఈ ప్రచార లక్ష్యమన్నారు.
సదస్సు తర్వాత ప్రశాంత్ కిషోర్ బగాహా బజార్, నర్వల్- బర్వల్ ప్రాంతాల్లో పర్యటించి స్థానికులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ భారతి, ఎమ్మెల్సీ అఫాక్ అహ్మద్ సహా స్థానిక నాయకులు, అనేక మంది కార్యకర్తలు పాల్గొన్నారు.


