India
oi-Bomma Shivakumar
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా దాడులు చేస్తూనే ఉన్నాయి. ఇక ఇరాన్ సైతం ఇజ్రాయెల్ తో పాటు అమెరికా స్థావరాలపై దాడులకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో వంటగ్యాస్ సరఫరా నిలిచిపోతుందంటూ వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. వంటగ్యాస్ సంక్షోభం కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లకు అందించే వంట గ్యాస్ ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
బెంగళూరు వాసులకు బిగ్ షాక్.. రేపటి నుంచి బెంగళూరులోని హోటళ్లు, రెస్టారెంట్లు బంద్ కానున్నాయి. కారణం ఏంటంటే..? గ్యాస్ సంక్షోభం కారణంగా హోటళ్లకు అందించే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు నిలిపి వేస్తున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు స్పష్టం చేశాయి. ఇటీవల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు స్పష్టం చేస్తూ.. 70 రోజుల వరకూ ఎలాంటి అంతరాయం ఉండదని హామీ ఇచ్చాయి. కానీ అనూహ్యంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై హోటల్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా తీసుకున్న నిర్ణయం హోటల్ పరిశ్రమకు బిగ్ షాక్ అని చెప్పొచ్చు. ఈ మేరకు వాణిజ్య ఎల్ పీజీ సరఫరాను పునరుద్ధరించేలా కేంద్ర మంత్రులు తక్షణమే జోక్యం చేసుకోవాలని బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ కోరింది. ఇక బెంగళూరు లాంటి మహా నగరంలో హోటళ్లు మూతపడడం కారణంగా రోజూ బయట తినే బ్యాచిలర్స్, ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు వంట గ్యాస్ సిలిండర్ ధర శనివారం రూ. 60 పెరిగినట్లు సమాచారం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా సౌదీ అరేబియాలో ముడి చమురు ధరలకు రెక్కలు వచ్చాయి. ధరలు భారీగా పెరిగాయి. దాంతో కమర్షియల్ సిలిండర్ల ధరలు కూడా భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు వేగంగా పెరుగుతున్న గ్యాస్ సంక్షోభాన్ని అధిగమించేందుకు అల్జీరియా, ఆస్ట్రేలియా, కెనడా, నార్వే, యూఏఈ తదితర దేశాల నుంచి ఎల్పీజీని కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది.


