Telangana
oi-Sai Chaitanya
తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు. మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నిక వేళ బీఆర్ఎస్ పాత్ర ఆసక్తి కరంగా మారుతోంది. స్థానిక సమీకరణాలే ఆధారంగా బీఆర్ఎస్ నుంచి గెలిచిన కార్పోరేటర్లు.. కౌన్సిలర్లు తీసుకున్ననిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి. కరీంనగర్ లో బీఆర్ఎస్ ఎన్నికకు గైర్హాజరు కావటంతో… బీజేపీకి మేయర్ పీఠం ఖాయమైంది. కామారెడ్డికి కాంగ్రెస్ కు మద్దతుగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు నిలిచారు. పలు చోట్ల ఎన్నిక వాయిదా పడింది. ఇప్పుడు ఈ లెక్కలు కొత్త సమీకరణాలకు కారణంగా నిలుస్తోంది.
తెలంగాణ కార్పోరేషన్లు..మున్సిపాల్టీల్లో రాజకీయ లెక్కలు మారుతున్నాయి. బీఆర్ఎస్ నిర్ణయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. హంగ్ ఏర్పడిన కరీంనగర్ కార్పోరేషన్ లో బీఆర్ఎస్ తటస్థ వైఖరి ప్రదర్శించింది. ఇదే బీజేపీకి వరంగా మారింది. ఫలితంగా కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీకి దక్కింది. మేయర్ ఎన్నిక కోసం నిర్వహించిన బలపరీక్షలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. బీజేపీ అభ్యర్థి (కొలగాని శ్రీనివాస్) 34 ఓట్లు సాధించి ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి కేవలం 21 ఓట్లకు మాత్రమే పరిమితమయ్యారు. కార్పొరేషన్లో మొత్తం 66 డివిజన్లు ఉండగా.. బీజేపీ 30 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ 14 స్థానాలు, బీఆర్ఎస్ 9 స్థానాలు, స్వతంత్రులు 8 స్థానాలు, ఎంఐఎం 3 సీట్లు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రెండు స్థానాల్లో విజయం సాధించాయి. ఇక్కడ ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ లభించకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ గైర్హాజరుతో బీజేపీకి మేయర్ పీఠం దక్కింది.
మారుతున్న సమీకరణాలు
కాగా, కామారెడ్డిలో ఆసక్తికర రాజకీయం చోటు చేసుకుంది. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కౌన్సిలర్లు మద్దతు ఇవ్వటంతో మున్సిపల్ చైర్ పర్సన్ గా ఇప్ప ఉమారాణి (కాంగ్రెస్) ఎన్నిక అయ్యారు. ఇక, నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్గా ఉమా రాణి(కాంగ్రెస్) ఎన్నికయ్యారు. దీంతో, బీజేపీ ఆశలు ఫలించలేదు. నిజామాబాద్ కార్పొరేషన్ హస్తగతం అయింది. ఎంఐఎంతో కలిసి మేయర్ పీఠం కైవసం చేసుకున్న కాంగ్రెస్..మేయర్గా 49వ డివిజన్ నుంచి కార్పొరేటర్ ఉమా రాణి(కాంగ్రెస్)ను ఎంపిక చేసారు. అదే విధంగా డిప్యూటీ మేయర్ గా 54 డివిజన్ నుంచి కార్పోరేటర్ సల్మా తహసీన్(ఎంఐఎం) ఎన్నిక అయ్యారు. కరీంనగర్ను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఎన్నికల బరిలోకి దిగామని మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. కరీంనగర్ అభివృద్ధికి కేంద్రమంత్రులు, రాష్ట్రమంత్రులనూ కలుస్తానని చెప్పారు. బీజేపీ మేయర్ ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా వదిలేది లేదని హెచ్చరించారు. బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలన్నీ కలిసి సాధించింది ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల్లో మేం గెలిచినా… మేయర్గా ఓడించేందుకు మూడు పార్టీలు కలిసి కుట్రలు చేశాయని వ్యాఖ్యానించారు.


