India
oi-Bomma Shivakumar
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్- అమెరికా మధ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రతరం అవుతోంది. ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం ప్రపంచ దేశాలతో పాటు భారత్ పైనా పడుతోంది. భారత్ లో చమురు, గ్యాస్ కొరత ఏర్పడింది. ఎల్పీజీ సిలిండర్ల కొరత కారణంగా ఇప్పటికే పలు ప్రధాన నగరాల్లోని హోటళ్లు, రెస్టారెంట్స్, హాస్టళ్లు మూత పడుతున్న పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో బెంగళూరు ఫేమస్ ఐకానిక్ ‘విద్యార్థి భవన్’ హోటల్ మూసివేసినట్లు సమాచారం.
ఇరాన్ యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధిని నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచ దేశాలతో పాటు భారత్ పై వంటగ్యాస్ కొరత ప్రభావం పడింది. ఈ మేరకు దేశంలోని ప్రధాన నగరాలైన బెంగళూరు, చెన్నై, ముంబై, కోల్ కతా, లక్నోలో వాణిజ్య ఎల్పీజీ కొరత కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు పెద్ద సంఖ్యలో మూతపడుతున్నట్లు సమాచారం. ఇక వాణిజ్య సిలిండర్లకు కొరత ఏర్పడటంతో కర్ణాటక రాజధాని బెంగళూరులో రెస్టారెంట్లు, హోటల్ ఇండస్ట్రీ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది.
అలాగే బెంగళూరులో పీజీ(పేయింగ్ గెస్ట్)లు ఎక్కువగా ఉంటాయి. ఈ మేరకు పీజీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మెనూలో పలు మార్పులు చేసింది. ఇక నుంచి వీక్ డేస్ లో రోజుకు రెండు మీల్స్ మాత్రమే అందిస్తామని పేర్కొంది. అలాగే వీకెండ్స్ లో మాత్రం మూడు మీల్స్ అందిస్తామని స్పష్టం చేసింది. తాజా నిర్ణయంతో కేవలం శని, ఆదివారాలు మాత్రమే టిఫిన్ ఉంటుంది. మిగతా రోజుల్లో కేవలం రెండు మీల్స్ మాత్రమే ఉంటాయని తెలుస్తోంది.
మరోవైపు బెంగళూరులో ఐకానిక్ హోటల్ గా పిలువబడిన విద్యార్థి భవన్ కు యుద్ధ సెగలు తాకాయి. గ్యాస్ కొరత కారణంగా ఈ ఫేమస్ హోటల్ ను తాత్కాలికంగా మూసివేసినట్లు సమాచారం. ఈ వెజిటేరియన్ హోటల్ ను 1943 లో సౌత్ బెంగళూరు, బసవనగుడి, గాంధీ బజార్ లో ఏర్పాటు చేశారు. బెన్నె మసాలా దోశ ఇక్కడ చాలా ఫేమస్. ఈ దోశను తినేందుకు ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వస్తుంటారు. అలాగే పూరీ సాగు, ఫిల్టర్ కాఫీ కూడా ఇక్కడ ఫేమస్.


