బొగ్గు గనిలో పేలుడు.. 10 మంది దుర్మరణం!

Date:


India

oi-Jakki Mahesh

ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయాలో గురువారం పెనువిషాదం చోటుచేసుకుంది. ఈస్ట్ జయంతియా హిల్స్ జిల్లాలోని ఓ బొగ్గు గనిలో జరిగిన భారీ డైనమైట్ పేలుడులో 10 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో 10 మంది కార్మికులు అక్కడికక్కడే మరణించినట్లు తూర్పు జయంతియా హిల్స్ పోలీసు సూపరింటెండెంట్ వికాస్ కుమార్ ధ్రువీకరించారు

అసలేం జరిగిందంటే?

ఈస్ట్ జయంతియా హిల్స్ జిల్లాలోని మ్యన్‌సింగ్‌హట్-థాంగ్‌స్కో ప్రాంతంలో ఉన్న ఓ అక్రమ బొగ్గు గనిలో గురువారం మైనింగ్ కార్యకలాపాలు జరుగుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. పేలుడు ధాటికి గని ఉన్న కొండ ప్రాంతం పాక్షికంగా కుప్పకూలిపోయింది. ఈ శిథిలాల కింద మరికొందరు కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదని, వారిని గుర్తించడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇదే థాంగ్స్కొ ప్రాంతంలో గతంలో, 2025 డిసెంబరు 23న కూడా ఇలాంటి డైనమైట్ పేలుడే సంభవించింది. ఆ ప్రమాదంలో ఇద్దరు గని కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఇది ఈ ప్రాంతంలో అక్రమ మైనింగ్ వల్ల జరుగుతున్న రెండో పెద్ద ఘటన.

గాయపడిన వారిని చికిత్స కోసం షిల్లాంగ్‌కు తరలించినట్లు ‘ది అస్సాం ట్రిబ్యూన్’ నివేదించింది. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF), అగ్నిమాపక, అత్యవసర సేవల సిబ్బంది వెంటనే సహాయక చర్యల కోసం ఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడు ధాటికి గని ఉన్న కొండ పాక్షికంగా కూలిపోయినట్లు ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి, దీంతో మరికొందరు కార్మికులు లోపల చిక్కుకుని ఉండే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ అక్రమ మైనింగ్‌కు ఎవరు అనుమతి ఇచ్చారు, ఎవరి కుమ్మక్కుతో ఇది జరుగుతోందనే అంశంపై దర్యాప్తు సంస్థలు విచారణ ప్రారంభించాయి. ఈ వరుస ఘటనలు మేఘాలయాలో అక్రమ బొగ్గు మైనింగ్ సమస్యను మరోసారి చర్చనీయాంశం చేశాయి. ప్రతిపక్షాలు ఈ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించాయి. మేఘాలయ మానవ హక్కుల కమిషన్ (MHRC) సైతం ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి, రాష్ట్ర ప్రభుత్వం నుండి వివరణాత్మక నివేదిక కోరింది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related