Andhra Pradesh
oi-Lingareddy Gajjala
అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం సామాన్యుల వంటిల్లే కాదు.. వేలాది మంది ఆకలి తీర్చే పుణ్యక్షేత్రాల ప్రసాదశాలలను కూడా తాకింది. ఏలూరు జిల్లాలోని ప్రసిద్ధ క్షేత్రం ద్వారకా తిరుమలలో గ్యాస్ కొరత కారణంగా వింత పరిస్థితి నెలకొంది. స్వామివారి అన్నదానం, ప్రసాదాల తయారీకి సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో, ఆలయ యంత్రాంగం ఇప్పుడు పురాతన పద్ధతుల వైపు మళ్లుతోంది.
ద్వారకా తిరుమల వెంకన్నను దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. వకుళా మాత అన్నప్రసాద భవనంలో ప్రతిరోజూ సుమారు 10 వేల మంది భక్తులకు అన్నదానం జరుగుతుంది. దీనికి తోడు లడ్డు, పులిహోర, వడ వంటి ప్రసాదాల తయారీకి నిత్యం 25 డొమెస్టిక్, 15 కమర్షియల్ కలిపి మొత్తం 40 గ్యాస్ సిలిండర్లు అవసరమవుతాయి. అయితే, యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తమవ్వడంతో ఈరోజు రావాల్సిన సిలిండర్లు అందలేదు.
ప్రత్యామ్నాయంగా ‘కట్టెల’ స్టీమ్ ప్లాంట్!
గ్యాస్ లేదనే కారణంతో భక్తులకు ప్రసాద వితరణ ఆగకూడదని ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజి కీలక నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా గ్యాస్ ద్వారా వచ్చే స్టీమ్ (ఆవిరి)తో ప్రసాదాలు వండుతారు. ఇప్పుడు గ్యాస్ కొరత ఏర్పడటంతో, దానికి బదులుగా కట్టెలను కాల్చి ఆ వేడితో స్టీమ్ జనరేట్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే భారీగా కట్టెలను సమకూర్చుకునే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు.
కలెక్టర్కు విన్నపం..
ప్రస్తుతానికి నిల్వ ఉన్న గ్యాస్తో సరిపెడుతున్నామని, కానీ రాబోయే రోజుల్లో ఇబ్బంది కలగకుండా ఉండేందుకు జిల్లా కలెక్టర్ ద్వారా గ్యాస్ ఏజెన్సీలకు ప్రత్యేక ఆదేశాలు ఇప్పించినట్లు ఈవో తెలిపారు. పుణ్యక్షేత్రాలకు గ్యాస్ సరఫరాలో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్న తరుణంలో, భక్తుల విశ్వాసాలకు భంగం కలగకుండా దేవస్థానం ఇలా ‘కట్టెల పొయ్యి’ వంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.


