భారత్ కు గుడ్ న్యూస్.. 92 వేల టన్నుల LPGతో హార్మూజ్ జలసంధిని దాటిన భారత్ నౌకలు

Date:


International

-Bomma Shivakumar

పశ్చిమాసియాలో యుద్ధం భీకరంగా సాగుతోంది. యుద్ధం ప్రారంభం అయి రెండు వారాలు గడుస్తున్నా ఇరాన్, ఇజ్రాయెల్- అమెరికా మధ్య ఉద్రిక్త వాతావరణం ఏమాత్రం తగ్గడం లేదు. ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. అటు అగ్రరాజ్యం సైతం హార్మూజ్ జల సంధితో పాటు ఇతర స్థావరాలకు బలగాలను మోహరిస్తోంది. ఈ ఉద్రిక్తతల మధ్య భారత్ కు గుడ్ న్యూస్ అందించారు అధికారులు.

భారత్ జెండాలు కలిగిన రెండు భారీ నౌకలు హార్మూజ్ జలసంధిని దాటాయి. 92 వేల టన్నుల LPG తో హార్మూజ్ జలసంధిని ఈ నౌకలు దాటినట్లు స్పష్టం అవుతోంది. మార్చి 16 లేదా 17 నాటికి ఈ నౌకలు భారత్ కు చేరుకోనున్నాయి. ఇక అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధిని మూసివేసిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల భారత్ జెండాలు కలిగిన నౌకలను ఇరాన్ అనుమతిస్తోంది.

‘శివాలిక్’, ‘నందా దేవి’ అనే రెండు నౌకలు ప్రస్తుతం భారత్ కు చేరుకుంటున్నాయి. అధికారులు తెలిపిన అంచనాల ప్రకారం.. ఈ ట్యాంకర్లు మార్చి 16 లేదా 17 నాటికి ఎల్‌పీజీతో భారత్ కు చేరుకోవచ్చు. ‘శివాలిక్’ సుమారు 40,000 నుండి 55,000 మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీని రవాణా చేస్తుండగా.. ‘నందా దేవి’ 46,000 మెట్రిక్ టన్నులకు పైగా ఇంధనాన్ని మోసుకొస్తుంది. మొత్తం 92,000 టన్నులకు పైగా ఎల్‌పీజీ ప్రస్తుతం దేశానికి వస్తున్నట్లు భారత అధికారులు ధృవీకరించారు.

92,000 టన్నులకు పైగా ఎల్‌పీజీ రాకతో దేశ ఇంధన సరఫరాకు స్వల్పకాలిక ఉపశమనం అందిస్తుందని భావిస్తున్నారు.పరిమాణం తక్కువైనా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది చాలా ముఖ్యమైన పరిణామంగా పరిగణించవచ్చు. కొనసాగుతున్న సంక్షోభం వల్ల హార్ముజ్ జలసంధిలో షిప్పింగ్ కార్యకలాపాలు గణనీయంగా తగ్గాయి. భారత్ ఇంధన దిగుమతులకు ఈ మార్గం అత్యంత కీలకంగా ఉంది. దేశ ఎల్‌పీజీ దిగుమతుల్లో 90 శాతం, ముడి చమురు రవాణాలో 40 శాతం సాధారణంగా ఈ జలమార్గం గుండానే జరుగుతుంది. మరోవైపు వివిధ భద్రతాపరమైన కారణాలతో సుమారు 22 భారతీయ ట్యాంకర్లు ఇప్పటికీ హార్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయినట్లు సమాచారం.

మరోవైపు దేశంలోని పలు రాష్ట్రాల్లో కమర్షియల్ సిలిండర్ల డెలివరీ పునరుద్ధరించినట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో ఇటీవల కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే LPG ఉత్పత్తిని పెంచామని, నేటి నుంచి కమర్షియల్ సిలిండర్ల డిస్ట్రిబ్యూషన్ కొనసాగుతుందని కేంద్ర పెట్రోలియం, గ్యాస్ మినిస్ట్రీ జాయింట్ సెక్రటరీ పేర్కొన్నారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related