International
oi-Chandrasekhar Rao
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో హార్ముజ్ జలసంధి ఇప్పుడు కీలకంగా మారింది. అమెరికా, ఇరాన్ మధ్య హార్ముజ్ జలసంధిపై ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇరు దేశాలు పరస్పరం బెదిరింపులకు దిగుతున్నాయి. జలసంధిని 48 గంటల్లోపు పూర్తిగా తెరవకపోతే విద్యుత్ కేంద్రాలపై సైనిక చర్యకు దిగుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి.
స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ను పూర్తిగా మూసివేస్తామని ఇరాన్ తాజాగా హెచ్చరించింది. తమ దేశంలో ఏ ఒక్క విద్యుత్ ప్లాంట్ పై అయినా అమెరికా దాడి జరిగిన మరుక్షణమే హార్ముజ్ జలసంధి పూర్తిగా మూతపడుతుందని తేల్చి చెప్పింది. ఈ విషయంలో తాము వెనడుగు వేయబోమని, ట్రంప్ బెదిరింపులక లొంగే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. దీనివల్ల భారత్ సహా ఇతర మిత్రదేశాలకు అరకొరగా సాగుతున్న ఇంధన రవాణా సైతం పూర్తిగా స్తంభించిపోతుంది.
విద్యుత్ ప్లాంట్లపై బాంబు దాడి చేస్తామన్న బెదిరింపును ట్రంప్ అమలు చేసిన అనంతరం జరిగే పరిణామాలకు అమెరికా బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది ఇరాన్. దానిని నిరవధికంగా మూసివేయడంతో పాటు అమెరికా/ఇజ్రాయెల్ కు సహకరిస్తోన్న ఇతర గల్ఫ్ దేశాల మౌలిక సదుపాయాలపై దాడి చేస్తామని ఇరాన్ సైన్యం హెచ్చరించింది. ఈ జలమార్గంపై తనకు ఉన్న పట్టును ఆర్థికంగా ఉపయోగించుకునేందుకు ఇరాన్ చర్యలు తీసుకుంటోంది.
అమెరికా స్థావరాలకు ఆతిథ్యమిస్తున్న దేశాల్లోని ఇంధన కేంద్రాలను తాము లక్ష్యంగా చేసుకుంటామని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. తమ దేశ మౌలిక సదుపాయాలపై అమెరికా గానీ, దానికి సహకరిస్తోన్న ఇతర దేశాలు గానీ దాడులకు పాల్పడితే ప్రాంతీయ సౌకర్యాలను కోలుకోలేని విధంగా నాశనం చేస్తామని అటు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాక్వెర్ ఖాలిబాఫ్ సైతం హెచ్చరించారు.


