India
oi-Bomma Shivakumar
జమ్మూకాశ్మీర్ లోని కిష్ట్ వార్ జిల్లాలోని మారుమూల ప్రాంతంలో భారత బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు. వీరు జైషే- ఈ- మహమ్మద్(JEM) ఉగ్రవాద సంస్థకు చెందిన వారుగా గుర్తించారు. వైట్ నైట్ కార్ప్స్ దళం తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఆపరేషన్ త్రషి-1’ లో భాగంగా జమ్మూకాశ్మీర్ లోని కిష్ట్ వర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టింది. ఉగ్రవాదులను వెతికి పట్టుకుని హతమార్చేందుకు ఈ ఆపరేషన్ ను చేపట్టాయి బలగాలు.
అయితే జమ్మూకాశ్మీర్ లోని కిష్ట్ వర్ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఇంటెలిజెన్స్ బ్యూరోతో పాటు ఇతర నిఘా వర్గాల నుండి సమాచారం అందిన నేపథ్యంలో ఉమ్మడి సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ నేపథ్యంలో చత్రూ బెల్ట్ లోని పస్సెర్ కుట్ అటవీ ప్రాంతంలో ఫిబ్రవరి 22న భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వీళ్లు పాకిస్థాన్ కు చెందిన జైషే మహమ్మద్ సంస్థకు అనుబంధంగా ఉన్నట్లు సమాచారం.
‘ఆపరేషన్ త్రషి-1’ లో భాగంగా జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు విజయవంతంగా మట్టుబెట్టాయి. అలాగే వారి వద్ద నుండి రెండు ఏకే-47 రైఫిళ్లతో పాటు భారీగా పేలుడు పదార్థాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు.. హతమైన ఇద్దరు ఉగ్రవాదులు పాకిస్థాన్ జాతీయులని, నిషేధిత జైషే మహమ్మద్ సంస్థకు చెందిన వారుగా అధికారులు ధృవీకరించారు. అయితే పస్సెర్ కుట్ అటవీ ప్రాంతంలో మరికొందరు ఉగ్రవాదులు ఉండే అవకాశం ఉందన్న అనుమానంతో గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
ఇక గత నెల రోజులుగా చత్రూ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య దాదాపు అనేకసార్లు ఎన్ కౌంటర్లు జరిగాయి. ఈ ఏడాది జమ్మూ డివిజన్ లో ఇప్పటివరకు మొత్తం ఆరుగురు జైషే మహమ్మద్ ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఇదే విషయంపై గతంలో వైట్ నైట్ కార్ప్స్ దళం స్పందిస్తూ.. ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారికి ఎక్కడా ఆశ్రయం లభించదు.. మా వేట కొనసాగుతుందని పేర్కొంది.


