మింగ మెతుకు లేదు.. మరింత దిగజారిన పాకిస్థాన్ పరిస్థితి..!

Date:


International

-Bomma Shivakumar

పాకిస్థాన్‌ లో పేదరికం 11 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరింది. ప్రణాళికా మంత్రి అహ్సాన్ ఇక్బాల్ విడుదల చేసిన సర్వే ప్రకారం.. దేశ జనాభాలో దాదాపు 29 శాతం మంది ఇప్పుడు పేదరిక రేఖకు దిగువన జీవిస్తున్నారు. ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూనల్ అందించిన నివేదిక ప్రకారం.. నెలకు రూ. 8,484 కనీస అవసరాలకు సరిపోతుంది. ఈ ఆధారంగా దాదాపు 70 మిలియన్ల ప్రజలు తీవ్ర పేదరికంలో మగ్గుతున్నారు.

2018-19 నుంచి పేదరికం 32 శాతం పెరిగిందని, 2024-25 ఆర్థిక సంవత్సర ప్రాథమిక అంచనాలలో వెల్లడైంది. 2019లో 21.9 శాతం ఉన్న ఈ రేటు, ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రస్తుత ప్రభుత్వ తొలి సంవత్సరంలో 28.9 శాతానికి చేరింది. ఇది 2014 తర్వాత అత్యధికం. ఆదాయ అసమానతలు కూడా గత 27 ఏళ్లలో అత్యధికంగా 32.7 శాతానికి పెరిగాయి, చివరిసారి 1998లో ఈ స్థాయికి చేరుకున్నాయి. దేశంలో నిరుద్యోగిత రేటు 7.1 శాతంతో 21 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరింది.

పేదరికం పెరుగుదలకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) కార్యక్రమం కింద చేపట్టిన ఆర్థిక స్థిరీకరణ చర్యలు కారణమని ప్రణాళికా మంత్రి అంగీకరించారు. సబ్సిడీల ఉపసంహరణ, మారకపు రేటు క్షీణత, అధిక ద్రవ్యోల్బణం, ప్రకృతి వైపరీత్యాలు, మందగించిన ఆర్థిక వృద్ధి దోహదపడ్డాయి. గత 13 ఏళ్లలో మొదటిసారిగా పేదరికం తగ్గింపు ధోరణి తిరగబడిందని నివేదిక పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం 28.2 శాతం నుంచి 36.2 శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 11 శాతం నుంచి 17.4 శాతానికి పెరిగి తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

రాష్ట్రాల వారీగానూ పరిస్థితి దిగజారింది: పంజాబ్‌లో 16.5 శాతం నుంచి 23.3 శాతానికి, సింధ్‌లో 24.5 శాతం నుంచి 32.6 శాతానికి, ఖైబర్ పఖ్తుంఖ్వాలో 28.7 శాతం నుంచి 35.3 శాతానికి రేట్లు పెరిగాయి. బలూచిస్తాన్ 42 శాతం నుంచి 47 శాతానికి చేరుకుని, సగం జనాభా పేదరికంలో జీవిస్తోంది. వాస్తవ నెలవారీ గృహ ఆదాయం 2019లో రూ. 35,454 నుంచి రూ. 31,127కి (12 శాతం క్షీణత) పడిపోయింది. గృహ వ్యయం కూడా 5 శాతం పైగా తగ్గింది. నామమాత్రపు ఆదాయాలు పెరిగినా.. అధిక ద్రవ్యోల్బణం కొనుగోలు శక్తిని తగ్గించిందని నివేదిక తెలిపింది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related