Andhra Pradesh
oi-Chandrasekhar Rao
తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం నాడు 76,506 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 28,049 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.20 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 25 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 నుంచి 17 గంటల సమయం పట్టింది.
తిరుమలలో ఈ నెల 26 నుండి మార్చి 2వ తేదీ వరకు సాలకట్ల తెప్పోత్సవాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం స్వామి పుష్కరిణిలో తెప్పల ట్రయల్రన్ నిర్వహించారు. టీటీడీ అదనపు కార్యనిర్వాహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏర్పాట్లను పరిశీలించారు. తెప్పోత్సవాల కోసం నిర్వహించిన ట్రయల్ రన్ సక్సెస్ అయిందని, తెప్పలను పూర్తిగా సిద్ధం చేసినట్టు తెలిపారు. ఇంజినీరింగ్, విద్యుత్, ఆలయ అధికారులతో కలిసి తెప్ప సామర్థ్యాన్ని పరిశీలించినట్లు చెప్పారు.
ఈ ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు శ్రీసీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి, రెండో రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు తెప్పలపై విహరిస్తారు. చివరి మూడురోజులు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు తెప్పలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మొదటి మూడు రోజులు మూడుసార్లు, 4వ రోజు అయిదుసార్లు, చివరిరోజు ఏడుసార్లు తెప్పలపై ఉత్సవ మూర్తులు విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.
కాగా తెప్పోత్సవాల కారణంగా ఈ నెల 26, 27 తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, 28న, మార్చి 1, 2వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ విషయాన్ని భక్తులు గుర్తుంచుకోవాలని సూచించారు.


