Telangana
oi-Bomma Shivakumar
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం మహా జాతర ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఇక హుండీల లెక్కింపు ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ఈ మేరకు హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక ఈసారి జాతరలో మొత్తం 828 హుండీలు ఏర్పాటు చేశారు. అయితే తొలి రోజు 125 హుండీల లెక్కింపు పూర్తయింది. మొత్తం లెక్కింపుకు దాదాపు 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అయితే తాజాగా రెండో రోజు మేడారం హుండీల లెక్కింపు పూర్తి అయింది. రెండో రోజు 160 హుండీలను లెక్కించగా రూ.3,54,25,200 ఆదాయం సమకూరింది. అలాగే రూ.63,436 విలువగల విదేశీ కరెన్సీ లభ్యం అయింది. ఇక మొత్తం రెండు రోజుల్లో 285 హుండీల లెక్కింపులో రూ.6,04,53,636 ఆదాయం వచ్చింది. 828 హుండీల్లో ఇంకా 543 హుండీలు లెక్కించాల్సి ఉంది.
ఇక మేడారం జాతర హుండీల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయంలో 33 శాతం వాటాను పూజారులకు అందిస్తారు. గత జాతరలో సుమారు రూ.13 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే ఈసారి దాని కంటే మూడు రెట్లు అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక మొత్తం లెక్కింపుకు దాదాపు 10 రోజులకు పైనే సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లెక్కింపు పూర్తయ్యాకే మొత్తం ఆదాయం ఎంత వచ్చిందో అధికారికంగా ప్రకటించనున్నారు అధికారులు.
ఇక ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మేడారం మహా జాతర ఇటీవల ప్రశాంతంగా ముగిసిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల పాటు కొనసాగిన ఈ మహా జాతరకు దాదాపు రెండు కోట్ల మందికి పైగా భక్తులు తరలివచ్చినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు వన దేవతలు సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ జాతరకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చినప్పటికీ ఎక్కడా అపశ్రుతులు చోటుచేసుకోకుండా అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు.


