Telangana
oi-Chandrasekhar Rao
హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ లో ఓ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ కలకలం చెలరేగింది. ఇది అక్కడితో ఆగిపోలేదు. కాల్పులకు దారి తీసింది. ఈ ఘటనలో పలువురిని హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా వారి నుంచి కొకైన్, ఓ రివాల్వర్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం చెలరేగింది. ఆ మొయినాబాద్ ఫామ్ హౌస్ ఓ మాజీ ఎమ్మెల్యేకు చెందినది కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అరెస్టయిన వారిలో ఏపీ, తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఉన్నట్లు తెలుస్తోంది. మొయినాబాద్ అజీజ్ నగర్ లో గల ఓ ఫామ్హౌస్లో డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తోన్నట్లు పక్కా సమాచారం అందడంతో మొదట ఈగల్ టీమ్ సిబ్బంది ఫామ్హౌస్కు చేరుకున్నారు. నిర్వాహకులు వారిని అడ్డుకున్నారు. తనిఖీ చేయడానికి అంగీకరించలేదు. లోనికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో ఎస్ఓటీ అధికారులను పిలిపించారు.
ఎస్ఓటీ టీమ్, పోలీసులు వచ్చిన తర్వాత సోదాలు ముమ్మరం అయ్యాయి. ఎస్ఓటీ, ఈగల్ టీమ్, పోలీసులు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో చుట్టుముట్టిన పోలీసులను చూడగానే.. డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న వారు ఒక రౌండ్ పాటు గాలిలో కాల్పులు జరిపినట్లు విచారణలో తేలింది. అరెస్టయిన వారిలో కొందరి బ్లడ్ శాంపిల్స్ ను పరీక్షించగా.. డ్రగ్స్ వాడినట్లు నిర్ధారణ అయినట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా ఫామ్ హౌస్ నుంచి కొకైన్, రివాల్వర్, ఇతర మత్తు పదార్థాలు, అనుమతి లేకుండా వినియోగిస్తోన్న బల్క్ లిక్కర్ ను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఈ పార్టీకి కొందరు వీఐపీ అతిథులు హాజరైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Rangareddy: Based on information that a party was being held at a farmhouse without permission, the police conducted a raid at around 9:30 pm. Upon arrival, Delhi-based real estate businessman Namit Sharma fired one round from a gun. The gun, belonging to Ritesh Reddy, the…
— ANI (@ANI) March 15, 2026
వారిలో ఒకరిద్దరు ప్రజాప్రతినిధులు కూడా ఉండటం రాజకీయంగా దుమారానికి దారి తీసింది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. మరికొందరు అనుమానితులను ప్రశ్నించే అవకాశం ఉంది. డ్రగ్స్ వినియోగంపై పోలీసులు మరోసారి తాజా హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి పార్టీలపై కఠిన చర్యలు తీసుకుంటామని, పౌరులు సమాచారం ఇవ్వాలని కోరారు.


