India
oi-Jakki Mahesh
ఇరాన్, అమెరికా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం కారణంగా భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు జరిగే ఎగుమతులు నిలిచిపోయాయి. దీని ప్రభావం పౌల్ట్రీ రంగంపై తీవ్రంగా పడింది. గల్ఫ్ దేశాలకు ఎగుమతి కావాల్సిన కోడిగుడ్లు భారత్లోనే నిలిచిపోవడంతో మార్కెట్లో ధరలు భారీగా పడిపోయాయి. ప్రస్తుతం నెలకొన్న భద్రతా కారణాల దృష్ట్యా రవాణా మార్గాల్లో ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో యూఏఈ, ఒమన్, ఖతార్, బహ్రెయిన్ వంటి దేశాలతో వాణిజ్యం పూర్తిగా నిలిచిపోయింది. దీనివల్ల దేశీయ మార్కెట్లో గుడ్ల నిల్వలు పెరిగిపోయి ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. ఇది సామాన్య వినియోగదారులకు ఊరటనిచ్చినప్పటికీ.. ఎగుమతులపై ఆధారపడే పౌల్ట్రీ రైతులను మాత్రం ఆందోళనలోకి నెట్టింది.
గుడ్డు ధరల్లో మార్పు
ఎగుమతులు ఆగిపోవడంతో బెంగళూరు వంటి నగరాల్లో గుడ్డు ధరలలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతంలో ఒక్కో గుడ్డు ధర సుమారు 7 రూపాయలు ఉండగా.. ఇప్పుడు అది 5 రూపాయలకు పడిపోయింది. హోల్సేల్ వ్యాపారులు ఇప్పుడు 100 గుడ్లను కేవలం 500 రూపాయలకే కొనుగోలు చేయగలుగుతున్నారు. సామాన్యులకు గతంలో ఒక్కో గుడ్డు 8 నుండి 9 రూపాయల వరకు లభించేది. ప్రస్తుతం మార్కెట్లో అది 5.50 నుండి 6 రూపాయలకే అందుబాటులోకి వచ్చింది.
ఒకప్పుడు కోటి గుడ్లు.. ఇప్పుడు నిల్
పౌల్ట్రీ పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం.. యుద్ధ సంక్షోభం తలెత్తక ముందు భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు ప్రతిరోజూ సుమారు కోటి గుడ్లు ఎగుమతి అయ్యేవి. భారత్లో ఉత్పత్తి అయ్యే గుడ్లలో దాదాపు 80 శాతం గల్ఫ్ దేశాలకే వెళ్తాయి. అయితే ఇప్పుడు రవాణా వ్యవస్థ స్తంభించడంతో పాటు, రంజాన్ మాసంలో ఆహార వినియోగంలో మార్పులు రావడం వల్ల అక్కడ డిమాండ్ తగ్గింది. ఈ అదనపు స్టాక్ అంతా ఇప్పుడు భారత మార్కెట్లోకి మళ్లించాల్సి వచ్చింది.
పెరిగిన డిమాండ్.. ప్రోటీన్ లభ్యత
ధరలు తగ్గడంతో వినియోగదారుల నుంచి డిమాండ్ విపరీతంగా పెరిగింది. గతంలో అధిక ధరల కారణంగా గుడ్ల వినియోగాన్ని తగ్గించిన వారు ఇప్పుడు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. మధ్యతరగతి, పేద కుటుంబాలకు గుడ్డు ఇప్పుడు అందుబాటులో ఉన్న అతిపెద్ద ప్రోటీన్ వనరుగా మారింది. ఆరోగ్య నిపుణుల ప్రకారం, 100 గ్రాముల గుడ్డులో సుమారు 155 క్యాలరీలు, 12.6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది సమతుల్య ఆహారంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు సామాన్యుడి వంటింటి బడ్జెట్పై ఇలాంటి విచిత్రమైన ప్రభావాలను చూపుతుంటాయి. ధరలు తగ్గడం వినియోగదారులకు సంతోషాన్ని కలిగిస్తున్నా, పౌల్ట్రీ రైతుల నష్టాలను పూడ్చడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.


