International
-Syed Ahmed
ఇరాన్ (Iran)పై అమెరికా-ఇజ్రాయెల్ ప్రారంభించిన ఏకపక్ష యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. మరోవైపు యుద్ధం ముగింపుపై రోజుకో ప్రకటనలు చేస్తున్న ట్రంప్, సుదీర్ఘ యుద్దానికి సిద్ధంగా ఉన్నామంటున్న ఇరాన్.. ఇలా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా సాగిపోతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా-ఇజ్రాయెల్ తో యుద్దం ముగింపుకు మధ్య వర్తిత్వం వహించేందుకు పలు దేశాలు చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో ఇరాన్ స్పందించింది.
యుద్దం ఆపేందుకు ఇరాన్ 3 షరతులు (Iran)
యుద్దం ముగించాలంటే మూడు షరతులకు ఒప్పుకోవాలంటూ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఎక్స్ లో బహిరంగంగానే అమెరికా-ఇజ్రాయెల్ కు ఓ ట్వీట్ పెట్టారు. ఇందులో ఇరాన్ చట్టబద్దమైన హక్కును గౌరవించడం, యుద్ధ నష్టాలకు పరిహారం చెల్లించడం, భవిష్యత్తులో దాడులు చేయకుండా అంతర్జాతీయ స్థాయి హామీ ఇవ్వడం. ఈ మూడు కండిషన్లకు ఒప్పుకుంటే యుద్దం ముగించేందుకు సిద్దమని ఇరాన్ అధ్యక్షుడు ప్రకటించారు. దీంతో ఈ షరతులను అమెరికా-ఇజ్రాయెల్ అంగీకరించేలా అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతోంది.
Talking to leaders of Russia and Pakistan, I reaffirmed Iran’s commitment to peace in the region. The only way to end this war—ignited by the Zionist regime & US—is recognizing Iran’s legitimate rights, payment of reparations, and firm int’l guarantees against future aggression.
— Masoud Pezeshkian (@drpezeshkian) March 11, 2026
భారత్ పై ఇప్పటికే తీవ్ర ప్రభావం
మరోవైపు ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకున్న ఇరాన్ వార్ కారణంగా భారత్ సహా పలు దేశాల ఆర్దిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి. ముడి చమురు ధర బ్యారెల్కు 100 డాలర్లు దాటిపోయింది. ఇది ప్రపంచ మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఇంధన దిగుమతులపై అధికంగా ఆధారపడిన భారత ఆర్థికవ్యవస్థ దీంతో తీవ్ర ప్రమాదంలో పడింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంధన దిగుమతిదారు అయిన భారత్ పై గల్ఫ్ అస్థిరత వేగంగా ప్రభావం చూపుతోంది. హార్ముజ్ జలసంధి మీదుగా 40 శాతం చమురు, 60 శాతం ఎల్పీజీ దిగుమతులు చేసుకుంటున్న భారత్ ఇప్పుడు ఇరాన్ ను బతిమాలుకోవాల్సిన పరిస్దితికి వచ్చేసింది.
యుద్దం ఆగితే భారత్ కు జరిగే మేలు
ఈ నేపథ్యంలో చర్చలు విజయవంతమై యుద్ధం త్వరగా ముగిసినట్లయితే, భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం తగ్గుతుంది. సరఫరా ఆందోళనలు తగ్గితే చమురు ధరలు మునుపటి స్థాయికి వస్తాయి. ఉద్రిక్తతలు కొన్ని వారాల్లోనే పరిష్కారమైతే, క్రూడ్ బ్యారెల్కు $60-$70 పరిధిలోకి తిరిగి రావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. స్టాక్ మార్కెట్ల స్థిరీకరణ జరిగి ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంటుంది. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే భారత్ కు ఆర్థిక పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయి. అధిక చమురు ధరలు రవాణా, తయారీ ఖర్చులను పెంచుతాయి, ఇది ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. అదే సమయంలో, దిగుమతి బిల్లు పెరగడంతో దేశ కరెంట్ అకౌంట్ లోటు పెరుగుతుంది. చమురు ధరలలో ప్రతి 10% పెరుగుదల భారతదేశ జీడీపీ వృద్ధిని 20-25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.


