యుద్ధం ముగుస్తుందా? ఇరాన్‌పై ట్రంప్ సంచలన ప్రకటన!

Date:


International

oi-Jakki Mahesh

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం త్వరలోనే ముగియబోతోందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ప్రపంచ చమురు సరఫరాకు ఎటువంటి అంతరాయం కలిగించినా ఇరాన్‌ను ఉపేక్షించే ప్రసక్తే లేదని.. అమెరికా నుంచి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.

యుద్ధం ముగింపుపై ట్రంప్ సంకేతాలు
మియామి సమీపంలోని తన గోల్ఫ్ క్లబ్‌లో రిపబ్లికన్ చట్టసభ సభ్యులతో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్.. “మధ్యప్రాచ్యంలో కొంత చెడును తొలగించడానికి మేము ఒక చిన్న విహారయాత్ర (యుద్ధం) చేశాం. ఇది స్వల్పకాలికంగానే ఉంటుంది, ఈ విషయం మీకు త్వరలోనే తెలుస్తుంది” అని కామెంట్ చేయడం గమనార్హం. అమెరికా తన లక్ష్యాలను వేగంగా సాధిస్తోందని, ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి నిల్వలను నాశనం చేసే ప్రక్రియ చివరి దశలో ఉందని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.

హార్మూజ్ జలసంధిపై అమెరికా కన్ను
ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంపై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఒకవేళ ఇరాన్ హార్మూజ్ జలసంధి ద్వారా చమురు ప్రవాహాన్ని ఆపే ప్రయత్నం చేస్తే.. ఇప్పటివరకు ఎదుర్కొన్న దాడుల కంటే 20 రెట్లు ఎక్కువ తీవ్రతతో అమెరికా సమాధానం ఇస్తుంది” అని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. ఆ ప్రాంతాన్ని తమ నియంత్రణలోకి తీసుకునే అంశాన్ని కూడా అమెరికా పరిశీలిస్తోందని ఆయన సూచనప్రాయంగా తెలిపారు.

కొత్త సుప్రీం లీడర్‌గా ముజ్తాబా ఖమేనీ
ఇటీవల అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ఆయన కుమారుడు 56 ఏళ్ల ముజ్తాబా ఖమేనీని ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ప్రకటించింది. ఖమేనీ మరణం తర్వాత చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నప్పటికీ, యుద్ధం త్వరలో ముగుస్తుందనే అంచనాల నేపథ్యంలో ఆ తర్వాత ధరలు కొంత తగ్గుముఖం పట్టాయి. స్టాక్ మార్కెట్లు కూడా తిరిగి పుంజుకున్నాయి.

రష్యా దౌత్యం.. కొనసాగుతున్న దాడులు
ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దౌత్యపరమైన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. గల్ఫ్ దేశాలు, ఇరాన్ అధ్యక్షుడితో చర్చల అనంతరం రాజకీయ, దౌత్యపరమైన పరిష్కారం అవసరమని పుతిన్ అభిప్రాయపడినట్లు సమాచారం. మరోవైపు ఇజ్రాయెల్ దళాలు టెహ్రాన్, ఇస్ఫహాన్, ఇతర ప్రాంతాల్లోని ఇరాన్ కీలక సైనిక స్థావరాలపై దాడులను కొనసాగిస్తున్నాయి. సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలపై కూడా ఇరాన్ డ్రోన్, క్షిపణి దాడులు జరగడంతో ప్రాంతీయంగా భద్రతా పరమైన ఆందోళనలు తీవ్రంగా ఉన్నాయి. ఈ యుద్ధంలో ఇప్పటివరకు వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోగా.. దౌత్య చర్చల ద్వారానే శాంతి నెలకొంటుందా లేక యుద్ధం మరిన్ని రోజులు కొనసాగుతుందా అనేది వేచి చూడాలి.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related