International
oi-Bomma Shivakumar
భారత్ కు చిరకాల స్నేహితుడు ఎవరు అంటే రష్యా అని అందరికి తెలిసిందే. భారత్ కు ఏ కష్టం వచ్చినా సాయం చేయడంలో రష్యా ముందుంటుంది. పహల్గామ్ ఉగ్రదాడి సమయంలో పాకిస్థాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో చాలా వరకు రష్యా ఆయుధాలనే భారత్ వినియోగించి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక రష్యా నుంచి ముడి చమురును భారత్ ఎప్పటినుంచో కొనుగోలు చేస్తోంది. మధ్యలో అమెరికా ఆంక్షలు విధించినా.. రష్యాను మాత్రం భారత్ వదులుకోలేదు.
అయితే భారత్- రష్యా బంధం మరోసారి వెల్లివిరిసింది. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా దాడులు జరుపుతోంది. మరోవైపు ఇరాన్ సైతం ఏమాత్రం తగ్గకుండా ఒంటరి పోరాటం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ వద్ద ఉన్న బ్రహ్మాస్త్రం హార్మూజ్ జల సంధిని మూసివేసింది. దాంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు నిల్వలపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. భారత్ తో పాటు అనేక దేశాలకు చమురు సరఫరా నిలిచిపోయే ప్రమాదం నెలకొంది. మరోవైపు భారత్ కు దాదాపు 40 శాతం చమురు ఈ హార్ముజ్ జలసంధి గుండానే వస్తుంది.
ఇక భారత్ వద్ద కేవలం 25 రోజులకు సరిపోయే చమురు నిల్వలు మాత్రమే ఉన్నట్లు ఇటీవల కేంద్రం ప్రకటన చేసింది. ఈ క్రమంలోనే భారత్ కు మరోసారి ఆపన్నహస్తం ఇచ్చేందుకు రష్యా రెడీ అయింది. ఇండియాకు తగినంత చమురు సరఫరా చేసేందుకు సిద్ధమైంది. భారత్ కు ఏకంగా 9.6 మిలియన్ల బ్యారెళ్ల ముడి చమురును అందించేందుకు రష్యా సిద్ధమైనట్లు సమాచారం. ఈ మేరకు రష్యా చమురు నౌకలు భారత్ కు బయల్దేరినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
గతంలో భారత్ పై అమెరికా కన్నెర్ర చేసిన విషయం తెలిసిందే. రష్యా నుండి చమురు కొనుగోలు చేయవద్దని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలు కండీషన్స్ పెట్టారు. ఈ మేరకు భారత్ ఒత్తిడి తెచ్చారు. అంతటితో ఆగకుండా భారత్పై 25 శాతం అదనపు సుంకాలు కూడా విధించారు. అయినా భారత్ మాత్రం తన చిరకాల మిత్రుడు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ఆపలేదు. ఈ క్రమంలోనే భారత్ కు మరోసారి హెల్ప్ చేసేందుకు రష్యా ముందుకొచ్చింది.


