International
oi-Jakki Mahesh
పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లో వేర్పాటువాదుల దాడులతో అట్టుడుకుతున్న వేళ ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ(BLA) వంటి రెబల్ గ్రూపుల వద్ద అత్యంత అధునాతన అమెరికా ఆయుధాలు ఉన్నాయని, అవి కనీసం పాకిస్థాన్ సైన్యం వద్ద కూడా లేవని ఆయన అంగీకరించారు.
అత్యాధునిక టెక్నాలజీతో దాడులు
నేషనల్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన ఆసిఫ్.. బలూచ్ రెబల్స్ ఉపయోగిస్తున్న ఆయుధాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. “వారి వద్ద ఒక్కోటి రూ.20 లక్షల విలువైన రైఫిళ్లు ఉన్నాయి. అంత ఖరీదైన రైఫిళ్లు మా దగ్గర కూడా లేవు. అలాగే సుమారు 5,000 డాలర్ల విలువ చేసే థర్మల్ వెపన్ సైట్లు (నైట్ విజన్ పరికరాలు) వాడుతున్నారు. ఒక్కో రెబల్ దగ్గర ఉన్న మిలిటరీ గేర్ విలువ దాదాపు 20,000 డాలర్లు (సుమారు రూ.16 లక్షలు) ఉంటోంది. ఇంత డబ్బు ఎక్కడి నుండి వస్తోంది? వీరికి ఎవరు ఫండింగ్ చేస్తున్నారు?” అని ఆయన ప్రశ్నించారు.
ఆఫ్ఘనిస్థాన్పై ఆరోపణలు
బలూచ్ వేర్పాటువాద నాయకత్వం మొత్తం ఆఫ్ఘనిస్థాన్ కేంద్రంగా పనిచేస్తోందని ఆసిఫ్ ఆరోపించారు. సరిహద్దు అవతలి నుంచే వీరికి పూర్తి స్థాయిలో మద్దతు, ఆయుధాలు అందుతున్నాయని ఆయన పేర్కొన్నారు. బలూచిస్థాన్ భౌగోళికంగా చాలా పెద్ద రాష్ట్రం కావడం, రెబల్స్ అత్యాధునిక సాంకేతికతను వాడుతుండటంతో పాక్ భద్రతా దళాలు వారిని ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడుతున్నాయని ఆయన ఒప్పుకున్నారు.
పంజాబీలపైనే టార్గెట్
బలూచ్ రెబల్స్ ప్రధానంగా పాకిస్థానీ పంజాబీలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని మంత్రి ఖవాజా ఆసిఫ్ వెల్లడించారు. స్మగ్లింగ్ వంటి అక్రమ కార్యకలాపాల్లోనూ ఈ గ్రూపులకు సంబంధాలు ఉన్నాయని, ఇలాంటి వారితో చర్చలు జరిపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీపై ప్రభుత్వం పూర్తి స్థాయి ఉక్కుపాదం మోపుతుందని ఆయన హెచ్చరించారు.
కనివినీ ఎరుగని హింస
గత కొద్ది రోజులుగా బలూచిస్థాన్లో జరిగిన సమన్వయ దాడుల్లో ఇప్పటివరకు 250 మందికి పైగా మరణించారు. ఇందులో సుమారు 200 మంది తిరుగుబాటుదారులు ఉండగా.. 36 మంది పౌరులు, 22 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. బ్యాంకులు, జైళ్లు, పోలీస్ స్టేషన్లు, సైనిక స్థావరాలపై రెబల్స్ దాడులు చేయడంతో రాష్ట్రంలో యుద్ధ వాతావరణం నెలకొంది.


