India
oi-Chandrasekhar Rao
కేంద్ర కేబినెట్.. శుక్రవారం ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది. సౌత్ బ్లాక్ లో జరిగే ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనికి అధ్యక్షత వహించనున్నారు. ఇదే చివరి భేటీ కాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా కేంద్ర కేబినెట్ పలు అంశాలపై చర్చించనుంది. కొన్ని ప్రతిపాదనలు, తీర్మానాలను ఆమోదించే అవకాశం ఉంది. చివరి సమావేశం కావడం వల్ల దాదాపుగా మంత్రులందరూ దీనికి హాజరు కావాల్సి ఉంటుందని ప్రధానమంత్రి కార్యాలయం సూచించింది.
ఇదే చివరి భేటీ కావడానికి కారణాలు లేకపోలేదు. ఇకపై ప్రధానమంత్రి కార్యాలయం రీలొకేట్ కాబోతోంది. సౌత్ బ్లాక్ కు వీడ్కోలు పలకబోతోంది. ఇక్కడి నుంచి సేవా తీర్థ్ కు తరలి వెళ్లనుంది పీఎంఓ. శుక్రవారం మధ్యాహ్నం సేవా తీర్థ్ కు షిఫ్ట్ అవుతుంది. ఈ నేపథ్యంలో- సౌత్ బ్లాక్ లో చివరిసారిగా సమావేశం కావాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ భేటీతో అయిదు దశాబ్దాలకు పైగా కేంద్రబిందువుగా కొనసాగుతూ వచ్చిన సౌత్ బ్లాక్ కు తెరపడుతుంది.
ఈ తరలింపునకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ తన చివరి క్యాబినెట్ సమావేశాన్ని సౌత్ బ్లాక్లోనే నిర్వహిస్తారు. క్యాబినెట్ భేటీ అనంతరం మంత్రులు, అధికారులు సేవా తీర్థ్కు చేరుకుంటారు. సౌత్ బ్లాక్ నుండి కిలోమీటరు లోపే ఈ సేవా తీర్థ్ కాంప్లెక్స్ నిర్మితమైంది. పీఎంఓ, క్యాబినెట్ సెక్రటేరియట్, జాతీయ భద్రతా సలహాదారు కార్యాలయం, ఉన్నత స్థాయి ప్రతినిధుల ఇండియా హౌస్.. వంటివి ఇందులో కొనసాగుతాయి.. ఇకపై.
పీఎంఓ 1947లో చిన్న సచివాలయంగా ప్రారంభమైంది. 1931లో నార్త్ బ్లాక్తో నిర్మితమైన సౌత్ బ్లాక్ భారత పాలనలో అనేక కీలక ఘట్టాలను చూసింది. జవహర్లాల్ నెహ్రూ హయాంలో మొదటి క్యాబినెట్ సమావేశం ఇక్కడే జరిగింది. 1964లో ‘అలోకేషన్ ఆఫ్ బిజినెస్ రూల్స్’ కింద ప్రధాని సచివాలయానికి చట్టబద్ధత లభించగా, ఇందిరా గాంధీ హయాంలో అధికార పరిధి గణనీయంగా పెరిగింది. 1977లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ప్రధానమంత్రి కార్యాలయంగా మార్చింది.
సేవా తీర్థ్.. కేంద్ర పరిపాలన పునర్నిర్మాణ ప్రయత్నాల్లో కీలక మైలురాయి. మున్ముందు రక్షణ, విదేశాంగ మంత్రిత్వ శాఖలు సౌత్ బ్లాక్ నుండి షిఫ్ట్ కానున్నాయి. పరిపాలనను ఆధునీకరించి సామర్థ్యం పెంచే విస్తృత కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాలను తీసుకుంది.


