Andhra Pradesh
oi-Chandrasekhar Rao
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. గురువారం నాడు 70,606 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 28,415 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.39 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకూ క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది.
మరోవంక ఉగాది వేడుకలకు తిరుమల, తిరుపతి ఆలయాలు ముస్తాబవుతున్నాయి. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా నూతన సంవత్సరాది ఉత్సవాలను నిర్వహించడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సిరులతల్లిగా పూజలందుకుంటోన్న తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో రేపు ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, మధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 7:30 గంటల వరకు పుష్ప పల్లకిలో అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. రాత్రి 8 నుండి 8:30 గంటల వరకు పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనం, కుంకుమార్చన, ఊంజల్ సేవను టీటీడీ రద్దు చేసింది.
తిరుపతిలోని అన్ని ఆలయాల్లో ఉగాది వేడుకలు జరుగనున్నాయి. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఘనంగా జరుగనున్నాయి. ఈ కార్యక్రమం ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో మంగళధ్వని నిర్వహిస్తారు. అనంతరం ఎస్వీ ఉన్నత వేద విద్యాధ్యయన సంస్థ పండితులు వేదపారాయణం చేస్తారు.
ఉదయం 10:05 నిమిషాలకు ప్రముఖ పండితులు పంచాంగ శ్రవణం చేపడతారు. అనంతరం కవి సమ్మేళనం జరుగుతుంది. దీని తర్వాత డాక్టర్ పూజారి వరలక్ష్మి భగవద్గీత అనుష్టానం, శ్రీ హేమ వేంకట నారాయణ భగవద్గీత అష్టావధానం నిర్వహిస్తారు. టీటీడీ ఉద్యోగుల పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. పలు పోటీల్లో గెలిచిన ఉద్యోగులకు బహుమతులు అందజేస్తారు.


