Andhra Pradesh
oi-Lingareddy Gajjala
ఇంకా వేసవి ప్రారంభమే కాలేదు.. కానీ వచ్చే ఖరీఫ్ పై రైతన్నలు ముందుగానే ఆసలు పెట్టుకోవడం సహజం. వచ్చే సీజన్ లో ఏ పంట వేయాలి.. వర్షపాతం ఎలా ఉంటుందనే గందరగోళంలో ఉన్న వారికి షాకింగ్ విషయాన్ని మోసుకొచ్చింది వాతావరణ శాఖ. ఖరీఫ్ సీజన్పై ఎల్నినో ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రైతాంగం అప్రమత్తంగా ఉండటం అవసరం. ఈ ఏడాది వర్షాకాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది.
ముఖ్యంగా మే నెల నుంచి జులై లేదా ఆగస్టు మధ్య కాలంలో ఎల్నినో ప్రభావం 50 నుంచి 61 శాతం వరకు ఉండవచ్చని, ఇది అక్టోబరు వరకు కొనసాగే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో రుతుపవనాలు బలహీనపడి, సుదీర్ఘ కాలం పాటు పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. దీనివల్ల వర్షాధారిత పంటలు సాగు చేసే రైతులు పెట్టుబడులు కోల్పోయే ప్రమాదం ఉందని, వ్యవసాయ మరియు ఉద్యాన పంటల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యామ్నాయ వ్యవసాయ ప్రణాళికలు
ఈ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముందస్తు చర్యలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించి, ఎల్నినో ప్రభావానికి అనుగుణంగా ప్రత్యామ్నాయ వ్యవసాయ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సాగు నీటి లభ్యతను బట్టి రైతులకు తగిన సూచనలు చేయాలని, తక్కువ నీటితో పండే పంటల వైపు వారిని ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది.
తుది నివేదిక ఆధారంగా ..
ఉద్యాన పంటలు సాగు చేసే రైతులు సూక్ష్మసేద్యం (డ్రిప్, స్ప్రింక్లర్) పద్ధతులను అవలంబించడం ద్వారా నీటి ఎద్దడి నుంచి కొంతమేర బయటపడవచ్చని అధికారులు సూచిస్తున్నారు. ఐఎండీ నుంచి ఏప్రిల్లో వచ్చే తుది నివేదిక ఆధారంగా క్షేత్రస్థాయిలో రైతులకు మరింత స్పష్టమైన అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
మార్చి మొదటి వారంలోనే ..
మరోవైపు, ప్రస్తుత మార్చి నెలలోనే ఎండల తీవ్రత పెరగనుండటం ఆందోళన కలిగిస్తోంది. మార్చి మొదటి వారంలోనే దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 6.5 డిగ్రీల వరకు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. మన రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల అదనపు వేడి పెరగవచ్చని అంచనా వేసింది.
సీమలో భగభగలు..
ఇప్పటికే అనంతపురం వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలు దాటాయి. ఈ వేసవి మంటల వల్ల సాగులో ఉన్న పంటలకు నీటి ఎద్దడి కలగకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాభావ పరిస్థితుల కారణంగా భవిష్యత్తులో పండ్లు, కూరగాయలు మరియు వాణిజ్య పంటల ధరలు పెరిగే అవకాశం ఉన్నందున, రైతులు మార్కెట్ పరిస్థితులను బట్టి తమ సాగు నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం.


