Telangana
oi-Dr Veena Srinivas
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026- 27 బడ్జెట్లో అనేక విప్లవాత్మక నిర్ణయాలను తీసుకుని ప్రకటన చేశారు. ముఖ్యంగా రైతుల ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఈ సంవత్సరం మూడు లక్షల 24 వేల 234 లక్షల కోట్లతో బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గిరిజన రైతులను ఉద్దేశించి శుభవార్త చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇందిర సౌర గిరిజల వికాసం పథకం
గిరిజన రైతుల సంక్షేమానికి ఉద్దేశించిన ఇందిర సౌర గిరిజల వికాసం పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.ఈ పథకం ద్వారా మారుమూల గిరిజన రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించటమే ప్రధాన లక్ష్యంగా చెబుతున్నారు ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.10 లక్షల మంది గిరిజన రైతులు లబ్ది పొందుతారని తెలిపారు. గిరిజన రైతులకు వంద శాతం సబ్సిడీతో సోలార్ పంప్ సెట్ లను ప్రభుత్వం అందిస్తుందన్నారు.
పోడు భూముల్లో అటవీ ఉత్పత్తుల తోటలను పెంచాలని ప్రభుత్వ నిర్ణయం
ముఖ్యంగా ఆరు లక్షల ఎకరాల పోడు భూముల్లో అటవీ ఉత్పత్తుల తోటలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.విద్యుత్ సౌకర్యం లేని అటవీ ప్రాంతాలలో సౌరశక్తి ద్వారా సాగునీటిని అందించి, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది అన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ పథకం తాలూకు ఫలితాలను అధ్యయనం చేసి రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
వ్యవసాయం, సాగునీటి రంగాలకు బడ్జెట్ లో భారీగా నిధులు
రైతు సంక్షేమం పైన ప్రభుత్వం దృష్టి పెట్టిందని, వ్యవసాయం, సాగునీటి రంగాలకు బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించిందని పేర్కొన్నారు.సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి 22 వేల 600 కోట్లు, వ్యవసాయ రంగానికి 23 వేల 179 కోట్ల రూపాయలను కేటాయించినట్టు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తెలిపారు.
సాధారణ రైతులతో పాటు పోడు రైతులకు లబ్ది
రైతు భరోసా కు 18 వేల కోట్ల రూపాయలు, వ్యవసాయ ఉత్పత్తుల బోనస్ కోసం 3500 కోట్ల రూపాయల కేటాయించి పలు కీలక నిర్ణయాలు తీసుకుని రైతు సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఈ కేటాయింపులతో సాధారణ రైతులతో పాటు, గిరిజన పోడు రైతులకు కూడా లబ్ధి జరగనుంది. గిరిజనులకు ఆర్థిక భరోసా కల్పించి వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు కృషి చేసేలా. తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన రైతుల కోసమే 100% సబ్సిడీతో అంటే ఉచితంగా సోలార్ పంప్ సెట్లను ఏర్పాటు చేసి వారి పోడు వ్యవసాయానికి దోహదం చేయనుంది.


