Telangana
oi-Sai Chaitanya
రైతులకు తెలంగాణ ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఎంతో కాలంగా వేచి చూస్తున్న రైతు భరోసా నిధుల పైన నిర్ణయం తీసుకుంది. ఎట్టకేలకు ముహూర్తం ఖరారు చేసింది. అదే సమయంలో గత సీజన్ లో నిధులు విడుదల చేసిన వారందరికీ తిరిగి ఈ సారి ఖాతాల్లో జమ చేయాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి సమయంలోనే నిధులు విడుదల చేస్తారని రైతులు వేచి చూసారు. కాగా, తాజాగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావటంతో.. కోడ్ ఎత్తివేసిన వెంటనే రైతుల ఖాతాల్లో.. దాదాపు రేపు (17వ తేదీ) నిధులు జమ చేయాలని డిసైడ్ అయింది.
తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది అన్నదాతలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. సుదీర్ఘ కాలంగా వేచి చేస్తున్న ‘రైతు భరోసా’ నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 17న రైతులకు పెట్టుబడిసాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. యాసంగి సీజన్కు సంబంధించి పెండింగ్లో ఉన్న ఈ నిధులను ఒకే విడతలో రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు కసరత్తు వేగవంతం చేసినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. రైతులకు సాగు పెట్టుబడికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వారి ఖాతాల్లో నగదు జమ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు. మునిసిపల్ ఎన్నికల కోడ్, ఇతర సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైన ఈ ప్రక్రియను ఇప్పుడు వేగవంతం చేశారు. విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు డబ్బు అవసరమైన తరుణంలో ప్రభుత్వం రైతు భరోసా విడుదల చేస్తే తమకు ఎంతో ఊరట కలుగుతుందని రైతులు భావిస్తున్నారు.
ప్రభుత్వం తాజా నిర్ణయంతో
కాగా, రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో 69,39,548 మంది రైతులకు ఎకరానికి రూ.6వేల చొప్పున రూ.8,744.13 కోట్లు రైతు భరోసా కింద ఇచ్చారు. దాదాపు 1,45,73,000 ఎకరాలకు నిధులు అందించారు. ఈ యాసంగిలోనూ దాదాపు 1.46 కోట్ల ఎకరాలకు రైతు భరోసా అందనుంది. రైతు భరోసా కోసం ప్రభుత్వం రూ.9వేల కోట్లను ఖర్చు చేయనుంది. మున్సిపల్ ఎన్నికల కోడ్ పూర్తిని వెంటనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని సీఎం రేవంత్ ఆర్దిక శాఖ అధికారులకు తాజాగా నిర్దేశించారు. అయితే, కొద్ది రోజులుగా లబ్దిదారుల ఖాతాల్లో భారీగా కోత ఉంటుందనే చర్చ జరిగింది. శాటిలైట్ సర్వే నివేదికను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఇప్పటికే నిధుల సమీకరణ పూర్తి కావటంతో 17వ తేదీ నుంచి వరుసగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.


