Telangana
oi-Sai Chaitanya
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలకు సిద్దమైంది. మున్సిపల్ ఎన్నికల్లో విజయం తరువాత ఇక ఇప్పుడు సీఎం రేవంత్ పరిషత్.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా సంక్షేమ నిర్ణయాలను మరింత పక్కాగా అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల పైన తుది నిర్ణయం తీసుకోనున్నారు. రైతు భరోసా తో పాటుగా మహాలక్ష్మీ పథకం పైన కీలక నిర్ణయాల దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఈ రోజు వీటి పైన అధికారికంగా ఆమోదం వేసే అవకాశం కనిపిస్తోంది.
తెలంగాణ కేబినెట్ ఈ రోజు సమావేశం కానుంది. కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. రైతు భరోసా నిధుల విడుదల పైన కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే నిధుల సమీకరణ ప్రక్రియ పూర్తి చేసినా.. నిధుల విడుదల జరగలేదు. దీంతో.. రైతులు నిధుల కోసం వేచి చూస్తున్న సమయంలో.. ప్రభుత్వం రానున్న రెండు రోజుల్లో ఈ నిధుల విడుదల కు ఆలోచన చేస్తోంది. దీంతో, ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల్లో ఇంకా పెండింగ్లో ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీల ఖరారు వంటి అంశాలపై నిర్ణయాలు వెలువడనున్నాయి. ఇటీవలి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ సత్తా చాటిన నేపథ్యంలో.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచనకు వచ్చింది. పరిషత్ ఎన్నికలను నిర్వహించాలనుకుంటే.. మార్చి 14లోపే పూర్తి చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పరిషత్లకు ప్రత్యక్ష ఎన్నికా, పరోక్ష ఎన్నికా? టెన్త్ పరీక్షలకు ముందా, తర్వాతా అన్నదానిపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనునుంది.
కీలక అంశాలే అజెండా
ఇక, 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశాలను ఎప్పటి నుంచి చేపట్టాలన్న దానిపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది.అదే విధంగా ఈ రోజు జరిగే సమావేశం లో యాసంగి రైతుభరోసా విడుదల, నిధుల సర్దుబాటుపై సమీక్షించనుంది. ఇక.. జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లలో ఉద్యోగులు, సిబ్బంది సర్దుబాటు, పాలక వర్గాలకు భవనాలు తదితర కీలక అంశాలపై.. ప్రస్తుతం ప్రైవేటు పరిధిలో ఉన్న మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసు కోవడం, తర్వాత నిర్వహణ అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. దేవాదుల ప్యాకేజీ-3 పనులకు నిధులు మంజూరు చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. మహాలక్ష్మి స్మార్ట్ కార్డు, గిగ్ వర్కర్ల బిల్లుపైనా చర్చించి.. తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక కీలకమైన ‘గాంధీ సరోవర్ ప్రాజెక్టు’, హైస్పీడ్ రైల్వే కారిడార్ కోసం శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో 500 ఎకరాల మేర భూముల కేటాయింపు అంశాలపైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దీంతో.. కేబినెట్ లో తీసుకునే నిర్ణయం కోసం రైతులు వేచి చూస్తున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రస్తుత పరిస్థితుల్లో కీలకంగా మారనున్నాయి.


