Andhra Pradesh
oi-Sai Chaitanya
రాజకీయ దుమారం గా మారిన లడ్డూ వ్యవహారంలో కీలక మలుపు. కొంత కాలంగా లడ్డూ వివాదం లో రాజకీయంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మండలిలో ఈ అంశం పైన చర్చకు వైసీపీ పట్టుబడుతోంది. ప్రభుత్వం తొలిగా అసెంబ్లీలో చర్చ చేపట్టాలని డిసైడ్ అయింది. ఇందుకు ముహూర్తం ఖరారు చేసింది. అయితే, ఈ చర్చకు జగన్ హాజరు పైన చర్చ మొదలైంది. జగన్ హాజరు అయితే ఏం జరుగుతుంది.. హాజరు కాకుంటే ఎలా ఉంటుందనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికర విశ్లేషణలు మొదలయ్యాయి.
అసెంబ్లీ వేదికగా రేపు (మంగళవారం) లడ్డూ వివాదం పైన చర్చ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి లోకేష్ కీలక అంశాలను వెల్లడించారు. శ్రీవారి లడ్డూ కల్తీకి సంబంధించిన వాస్తవాలన్నీ మంగళవారం అసెంబ్లీలో పెడతామని తెలిపారు. సభకు రావడం సభ్యులుగా వారి బాధ్యత అంటూ వైసీపీ ఎమ్మెల్యేలకు ఆయన సూచించారు. అసెంబ్లీకి రమ్మని ఎవ్వరూ బొట్టుపెట్టి పిలవరంటూ ఈ సందర్భంగా వారికి చురకలంటించారు. దేవుడిని సైతం వైసీపీ రోడ్డు మీదకు తీసుకురావడం బాధాకరమన్నారు.
దేవుడి ఫొటోలతో చట్టసభల్లో ర్యాలీలు చేయడం అభ్యంతరకరమని లోకేశ్ వ్యాఖ్యానించారు. కల్తీ నెయ్యి వివాదం పై ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్)ను ఏర్పాటు అయింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు విచారణ జరిగింది. కాగా.. ఈ మొత్తం వ్యవహారం పైన అసెంబ్లీలో చర్చ చేపట్టి.. అన్ని అంశాలను వెల్లడించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. వైసీపీ అసెంబ్లీకి గైర్హాజరు వేళ.. ఈ నిర్ణయం తో జగన్ తన నిర్ణయం మార్చుకొని సభకు వస్తారా.. గైర్హాజరు నిర్ణయానికే కట్టుబడి ఉంటారా అనేది తేలాల్సి ఉంది.
జగన్ హాజరు పై కొనసాగుతున్న సస్పెన్స్
అయితే, ప్రభుత్వం రేపు అసెంబ్లీలో చర్చకు లడ్డూ అంశం పైన చర్చ చేస్తే.. జగన్ వస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు. కాగా.. అటు జగన్ పులివెందుల పర్యటన ఖరారైంది. కీలకమైన లడ్డూ అంశం లో జగన్ సభకు హాజరు కాకుంటే.. రాజకీయంగా కూటమి ఫిక్స్ చేసే అవకాశం ఉందనే చర్చ వైసీపీలో వినిపిస్తోంది. జగన్ సభకు వచ్చినా.. మాట్లాడే అవకాశం ఇవ్వరనేది మరో వాదన. అయితే, సభకు వచ్చి.. మాట్లాడే అవకాశం ఉంటే వినియోగించుకోవాలని.. లేకుంటే బయటకు వచ్చి వాదన వినిపించవచ్చని సీనియర్ నేతలు సూచించినట్లు తెలుస్తోంది.
దీని పైన జగన్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ వ్యవహారంలో రాజకీయంగా ఒకరిని ఒకరు ఫిక్స్ చేసేందుకు అటు కూటమి.. ఇటు వైసీపీ ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంలో అసెంబ్లీలో చర్చ చేపడితే.. కూటమి తమ వాదన సభ ద్వారా వినిపించేందుకు సిద్దమైంది. దీంతో.. జగన్ ఇప్పుడు తీసుకునే నిర్ణయం రాజకీయంగా వైసీపీకి కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది.


