Telangana
oi-Dr Veena Srinivas
తెలంగాణ ప్రభుత్వం లైఫ్ సైన్సెస్ లో కొత్త రికార్డును సృష్టించబోతోంది. ఫిబ్రవరి 17వ తేదీన ప్రపంచస్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 23వ బయో ఏషియా 2026 అంతర్జాతీయ సదస్సుకు హైదరాబాద్ వేదిక కానుంది . హైటెక్స్ వేదికగా రెండురోజుల పాటు జరిగే సదస్సును రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్గా హైదరాబాద్ ను మార్చాలని సంకల్పించిన రేవంత్ రెడ్డికి ఈ సదస్సు ప్రాధాన్యత అంశంగా మారింది.
ఏఐ, ఆటోమేషన్ లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాలపై ప్రభావంపై సదస్సు
ఈ ఏడాది సదస్సును ‘టెక్బయో అన్లీష్డ్ – ఏఐ, ఆటోమేషన్, జీవశాస్త్ర రంగంలో వస్తున్న విప్లవాత్మక పరిణామాలు’ (TechBio Unleashed – AI, Automation & the Biology Revolution) అనే థీమ్ తో నిర్వహిస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు ఆటోమేషన్, లైఫ్ సైన్సెస్, హెల్త్కేర్ రంగాలను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి అనే అంశం పైన ఈ సదస్సులో లోతుగా చర్చిస్తారు.
ఈ సదస్సుకువిదేశాల నుండి ఎక్స్ పర్ట్స్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగా అంతర్జాతీయ ఎగ్జిబిషన్ను ప్రారంభించి, అనంతరం సదస్సును ఉద్దేశించి మాట్లాడతారు. ఈ సదస్సులో పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు ప్రపంచవ్యాప్తంగా పేరు ఎన్నికైన ఎక్స్ పర్ట్ లు కూడా పాల్గొంటారు. పెన్సిల్వేనియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ బ్రూస్ ఎల్ లెవిన్, ఆమ్జెన్ (USA) చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్ హోవర్డ్ వైచాంగ్ వంటి ప్రముఖులు ముఖ్య అతిథులుగా సదస్సుకు హాజరవుతున్నారు.
50కి పైగా దేశాల నుండి 4,000 మంది ప్రతినిధులు
వీరితో పాటు 50కి పైగా దేశాల నుండి సుమారు 4,000 మంది ప్రతినిధులు, శాస్త్రవేత్తలు మరియు ఫార్మా దిగ్గజాలు ఈ వేదికపై తమ అభిప్రాయాలను, నూతన ఆవిష్కరణలను పంచుకోనున్నారు. ఈ గణనీయమైన భాగస్వామ్యం హైదరాబాద్ను ప్రపంచ ఆరోగ్య రంగంలోనే గణనీయమైన మార్పులకు కేంద్రంగా నిలబెట్టేందుకు దోహదపడుతుంది. రెండు రోజులపాటు లైఫ్ సైన్సెస్ రంగానికి సంబంధించి జరిగే ఈ సదస్సులో అనేక కీలక అంశాల పైన చర్చించనున్నారు.
తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యానికి తగ్గట్టు రోడ్ మ్యాప్
ప్రధానంగా నెక్స్ట్ జనరేషన్ బయో లాజిక్స్, ఔషధ తయారీలో వస్తున్న నూతన మార్పులు, ఏఐ మరియు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, డేటా ఎనలిటిక్స్, ఏఐ సాయంతో రోగనిర్ధారణ, చికిత్స వంటి విషయాలపైన లోతైన విశ్లేషణలు జరుపుతారు. హైదరాబాద్లో ఈ సదస్సు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యానికి తగ్గట్టు రాష్ట్రాన్ని ఒక ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్ ఎకో సిస్టం గా మార్చడానికి అవసరమైన రోడ్ మ్యాప్ పైన చర్చిస్తారు.
ప్రపంచ లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ కు స్థానం
పరిశోధన, కొత్త వ్యాధుల చికిత్సకు అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటు, ప్రపంచ ఆరోగ్య ప్రభావం వంటి అనేక అంశాల పైన లోతుగా చర్చిస్తారు. ఈ చర్చల ద్వారా హైదరాబాద్ నగరం ప్రపంచ లైఫ్ సైన్సెస్ రంగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోనుంది. దేశంలోనే అతిపెద్ద టెక్ బయో హబ్ గా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం లక్ష్యంగా ఈ సదస్సును ఇక్కడ నిర్వహించడం తెలంగాణాకు లబ్ధిని చేకూర్చనుంది.


