Andhra Pradesh
oi-Dr Veena Srinivas
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమంపై దృష్టి సారించి, అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. అన్ని వర్గాలకు మేలు చేకూరే విధంగా అందిస్తున్న పథకాలు ఏపీ ప్రజలకు చాలా భరోసా అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు “ప్రవాసాంధ్ర భరోసా భీమా పథకం”ను విదేశాలలో చదువుకోవాలని వెళ్ళే విద్యార్థుల కోసం, అక్కడ పని చేయటానికి వెళ్ళే వారి కోసం అందిస్తున్నారు.
ప్రవాసాంధ్రుల కోసం ప్రత్యేక భీమా పథకం
విదేశాల్లో పనిచేస్తున్న ఆంధ్రులకు ఆర్థిక భద్రత, పూర్తి భరోసా కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టారు. ఇది ప్రవాసాంధ్రుల కుటుంబాలకు భీమా తో ధీమాను, భరోసాను అందించి రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఈ పథకం ద్వారా ఉద్యోగం, విద్య లేదా వ్యాపారం కోసమైనా విదేశాలకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ నివాసితులకు బీమా రక్షణ లభిస్తుంది.
ప్రవాసాంధ్ర భరోసా భీమా పథకం ప్రధాన లక్ష్యం ఇదే
ముఖ్యంగా, విదేశాల్లో చదువుకునే వారికి, పని చేసేవారికి ఊహించని ఆకస్మిక సంఘటనలు ఎదురైనప్పుడు, వారి మరణం సంభవించినప్పుడు ప్రవాసాంధ్రుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా నివారించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. పథకంలో నమోదైన వ్యక్తికి ప్రమాదవశాత్తు మరణం సంభవించినా లేదా శాశ్వత అంగవైకల్యం ఏర్పడినా, వారి కుటుంబానికి రూ.10 లక్షల వరకు ఆర్థిక సహాయం ఇస్తారు.
ఈ పథకం పొందటానికి వీరే ఆర్హులు
ఇది రాష్ట్ర ప్రభుత్వం నేరుగా పర్యవేక్షించే బీమా పథకం కావటంతో దీని విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.ఈ పథకం అమలు బాధ్యత ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీకి అప్పగించబడింది. విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజల సంక్షేమం, అభివృద్ధి, భద్రతలను పర్యవేక్షించడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తుంది. ఇక ఈ పథకం పొందాలి అనుకునే విదేశాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, విద్యార్థులు, వలస కూలీలు, వ్యాపారవేత్తలు ఈ పథకానికి అర్హులు.
విదేశాలకు వెళ్ళిన ఏపీ వాసుల కోసం
ఆసక్తి గలవారు https://apnrts.ap.gov.in/insurance వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ స్కీం గురించి మరింత సమాచారం కోసం 24/7 అందుబాటులో ఉండే హెల్ప్లైన్ నంబర్లు 0863-2340678, వాట్సాప్ నంబర్ 85000-27678 ద్వారా సంప్రదించవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశాలకు వెళ్లి మన రాష్ట్రం గౌరవాన్ని పెంచుతున్న ప్రతి తెలుగు వ్యక్తికి ప్రభుత్వం అండగా ఉంటుందని, అందుకే ఈ బీమా పథకం వారి భరోసా కోసం ఇస్తున్నామని స్పష్టం చేశారు.


