Telangana
oi-Sai Chaitanya
వాహనదారులకు బిగ్ షాక్. ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలు పెరిగాయి. ఈ మేరకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ప్రస్తుతం రూ.3,000లుగా ఉన్న వార్షిక పాస్ ధరపై 2.5 శాతం మేర పెంచుతున్నట్టు పేర్కొంది. ప్రతి ఏటా జరిగే టోల్ సమీక్షలో భాగంగా ఈసారి పెంపును ప్రకటించింది. మార్చి 31 లోగా రీఛార్జ్ చేసుకుంటే మాత్రం ప్రస్తుత ధరలే వర్తిస్తాయి. అంటే రూ.3,000లకే ఇయర్ పాస్ తీసుకోవచ్చు
దేశవ్యాప్తంగా వాహనదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) షాక్ ఇచ్చింది. ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం రూ.3,000లు గా ఉన్న వార్షిక పాస్ ధరపై 2.5 శాతం మేర పెంచుతున్నట్టు పేర్కొంది. తాజా పెంపుతో ఇకపై వార్షిక పాస్ ధర రూ.3,075గా ఉండనుంది. ఈ ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఎన్హెచ్ఏఐ స్పష్టం చేసింది. అయితే.. ఫాస్టాగ్ వినియోగదారులు మార్చి 31 లోగా రీఛార్జ్ చేసుకుంటే మాత్రం ప్రస్తుత ధరలే వర్తిస్తాయి. అంటే రూ.3,000లకే ఇయర్ పాస్ తీసుకోవచ్చు. ఒక్కసారి ఫాస్టాగ్ వార్షిక పాస్ తీసుకుంటే దేశవ్యాప్తంగా ఒక సంవత్సర కాలం లేదా 200 టోల్ప్లాజాల వద్ద ఆగకుండా ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది(ఏది ముందైతే అది). ఏడాది కాలంలో ఎన్నిసార్లైనా రీఛార్జ్ చేసుకోవచ్చని వెల్లడించింది.
కొత్త ధరల అమలు ఇలా
కాగా, కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం.. హైవే టోల్ ధరల వార్షిక సవరణలో భాగంగా ఈ ధరలను పెంచుతున్నట్లు ఎన్హెచ్ఏఐ అధికారులు వెల్లడించారు. 2026 ఆగస్టు 15న ప్రారంభమైన ఈ వార్షిక పాస్ విధానానికి వాహనదారుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇప్పటివరకు సుమారు 52 లక్షల మందికి పైగా వాహనదారులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. సులభంగా ఆన్లైన్ ద్వారా ఈ పాస్ పొందవచ్చు. రాజ్మార్గ్ యాత్ర యాప్ లేదా NHAI అధికారిక పోర్టల్ను సందర్శించాలి. మీ వాహన రిజిస్ట్రేషన్ నంబర్, ఫాస్టాగ్ వివరాలతో లాగిన్ అవ్వాలి. సవరించిన ధర రూ. 3,075ను యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి. పేమెంట్ పూర్తయిన 24 గంటల్లో మీ పాస్ యాక్టివేట్ అవుతుంది.


