Andhra Pradesh
oi-Chandrasekhar Rao
విజయవాడ డివిజన్ రైలు ప్రయాణికులకు శుభవార్త. కీలకమైన చెన్నై- హౌరా రైల్వే లైన్ లో మరిన్ని ట్రాక్ లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే విజయవాడ- గూడూరు మధ్య మూడో లైన్ గత ఏడాది చివర్లో సిద్ధమైంది. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు ఎటువంటి ఆటంకాలు ఉండట్లేదు. ఇప్పటివరకు డబ్లింగ్ లో ఉన్న లైన్ ఇది. అత్యంత రద్దీతో కూడుకున్న ఉన్న రూట్ కావడం వల్ల దీన్ని అప్ గ్రేడ్ చేశారు. మూడో రైల్వే లైన్ మార్గాన్ని నిర్మించారు.
ఇప్పుడు విజయవాడ- నిడదవోలు మధ్య రైల్వే ట్రాక్ విస్తరణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం డబ్లింగ్ లో ఉన్న ఈ రెండు స్టేషనల్ మధ్య 3, 4 లైన్లును నిర్మించడానికి రైల్వే మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అవసరమైన ప్రతిపాదనలపై రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. రైల్వే లైన్ల విస్తరణ దిశగా ముందడుగు పడింది. డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేయడానికి ఉద్దేశించిన ఫైనల్ లోకేషన్ సర్వేకు రైల్వే శాఖ నుండి ఆమోదం లభించినట్లు లోక్ సభ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు.
సర్వే పూర్తయిన తర్వాత ప్రాజెక్ట్ అమలుకు తదుపరి చర్యలు వేగవంతం అవుతాయి. ఈ రైల్వే లైన్ల విస్తరణతో రైలు ప్రయాణం మెరుగుపడటంతో పాటు సరుకుల రవాణా సామర్థ్యం కూడా గణనీయంగా పెరుగుతుంది. ఇది ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడుతుందని పురందేశ్వరి చెప్పారు. ఈ మేరకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ నుంచి తనకు అందిన అధికారిక లేఖను ఆమె ట్వీట్ చేశారు.
దక్షిణ మధ్య రైల్వే తన నెట్వర్క్ సామర్థ్యం పెంపునకు మౌలిక సదుపాయాల కల్పనపై ఇప్పటికే దృష్టి సారించింది. ప్రత్యేక రైళ్లను నడిపించడంతో పాటు కొత్త రైల్వే మార్గాలు, డబ్లింగ్/ట్రిప్లింగ్, ఎలక్ట్రిఫికేషన్ వంటి పనులకు ప్రాధాన్యత ఇస్తోంది. దేశంలోనే అత్యంత ఆదాయం అందుతోన్న జోన్ ఇది. ఉత్తరం- దక్షిణాది రాష్ట్రాలను అనుసంధానం చేసే పలు రద్దీ ట్రాక్ లు దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోకి వస్తాయి.
అందులో ఒకటి.. విజయవాడ- నిడదవోలు ట్రాక్. పలు రద్దీ రైళ్లు నిత్యం ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుంటాయి. లక్షలాదిమంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తుంటాయి. ఏపీ తీర ప్రాంతంలో గ్రాండ్ ట్రంక్ రూట్ లో ఉన్న చెన్నై సెంట్రల్- హౌరా కీలకం. ఉత్తర, తూర్పు రాష్ట్రాలను దక్షిణాదిని కనెక్ట్ చేయడంలో వ్యూహాత్మక పాత్ర పోషిస్తోంది. ప్రయాణికులు, గూడ్స్ రైళ్ల రద్దీ పెరగడంతో ఈ మార్గం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.


