India
oi-Chandrasekhar Rao
త్వరలో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది తమిళనాడు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈసారి ఎన్నికల బరిలో తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్ అడుగుపెడుతున్నందున అందరి దృష్టి ఆయనపైనే ఉంది. విజయ్ రాకతో త్రిముఖ పోటీ నెలకొంది. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి డీఎంకే.. ఈ పార్టీని గద్దె దింపడానికి ఏఐఏడీఎంకే ఇప్పటికే హోరాహోరి పోరు సాగిస్తోన్నాయి.
ఈ పరిణామాల మధ్య మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు, ఏఐఏడీఎంకే బహిష్కృత నాయకురాలు వీకే శశికళ కొత్త పార్టీ పేరును ప్రకటించారు. దీనికి ఆల్ ఇండియా పురచ్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర కజగం (AIPTMMK) పేరును ఖరారు చేశారు. ఈ పేరుతో నూతన రాజకీయ పార్టీని ప్రకటించారు. కొబ్బరి చెట్ల పొలాన్ని పార్టీ అధికారిక చిహ్నంగా ఆవిష్కరించారు. నలుపు, తెలుపు, ఎరుపు రంగులతో పాటు అన్నాదురై, ఎమ్జీఆర్, జయలలిత ఫొటోలను ముద్రించివున్న పతాకాన్ని విడుదల చేశారు.
దీంతో ఈ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది. టీవీకేతో సంప్రదింపులు ముమ్మరం చేసింది. బీజేపీ- టీవీకే చర్చలు కీలక దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టీవీకేకు ముందు పలు ప్రతిపాదనలు ఉంచిందనే ప్రచారం జరుగుతోంది. భారీ ఆఫర్లను అందించడానికి సైతం బీజేపీ అధిష్ఠానం అంగీకరించినట్లు చెబుతున్నారు.
ఈ క్రమంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే- బీజేపీ కూటమి గెలిస్తే విజయ్కి ఉప ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసినట్లు సమాచారం. దీంతో పాటు- టీవీకేకు సుమారు 80 అసెంబ్లీ సీట్లు ఆఫర్ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనిపై టీవీకే ఇప్పటికిప్పుడు ఎటువంటి నిర్ణయాలను తీసుకోలేదని అంటున్నారు.
ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే తమిళనాడులో రాజకీయ, ఎన్నికల సమీకరణాలను గణనీయంగా మారిపోతాయనే అబిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఉప ముఖ్యమంత్రి పదవికి బదులుగా విజయ్ ముఖ్యమంత్రి హోదాను ఆశిస్తోన్నారని, అదే ఈ చర్చల్లో కీలక అంశంగా కొనసాగుతోందనే వాదనలు లేకపోలేదు.
విజయ్, ఆయన పార్టీని ఎన్డీఏ గొడుగు కిందకు తీసుకురావాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే. క్రియాశీల రాజకీయాల్లోకి విజయ్ ప్రవేశించినప్పటి నుంచీ ఆయనపై ఓ కన్ను వేసి ఉంచింది. విజయ్ కు కోట్లాదిమంది అబిమానులు ఉండటం వల్ల టీవీకే చాలా తక్కువకాలంలో ప్రజల్లోకి చొచ్చుకెళ్లిందని, దాన్ని ఓటుబ్యాంకుగా మలచుకోవాలనేది బీజేపీ ప్రయత్నం.


