Telangana
oi-Dr Veena Srinivas
తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ప్రైవేట్ స్కూల్స్ కి షాక్ ఇచ్చారు. అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ స్కూల్స్ పై చర్యలకు సిద్ధమైనట్టు ప్రకటించారు. ప్రైవేటు పాఠశాలల అధిక ఫీజులపై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల ఆందోళనల నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖపై సమీక్ష నిర్వహించి, కీలక ఆదేశాలిచ్చారు. నిబంధనలు ఉల్లంఘించి ఫీజులు వసూలు చేస్తే అనుమతి రద్దు చేస్తామని హెచ్చరించారు. అధిక మొత్తాల రికవరీ తప్పదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
విద్యా కమీషన్ నివేదిక, స్పందించిన సీఎం రేవంత్
ఫీజుల నియంత్రణ, సలహాలు, ప్రజల అభిప్రాయం కోసం వెబ్సైట్లో ఉంచాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్ర సమగ్ర విద్యాపాలసీ కోసం ఏర్పాటైన తెలంగాణ విద్యా కమిషన్, సీఎం రేవంత్ రెడ్డికి నివేదికను సమర్పించింది. 305పాఠశాలలు, 46సమావేశాల విశ్లేషణ ఆధారంగా రూపొందించిన ఈ నివేదిక, ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ మోడల్ను సిఫార్సు చేసిందని కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి వివరించారు. దీనిపైన సీఎం కూడా నివేదికను చూసి సానుకూలంగా స్పందించారు.
విద్యాశాఖపై సమీక్ష , కీలక ఆదేశాలిచ్చిన రేవంత్
తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక అనంతరం జరిగిన ఈ సమీక్షలో, సీఎం ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాలపైన కూడా దృష్టి సారించారు. కోర్ అర్బన్ రీజియన్లోని ప్రభుత్వ పాఠశాలలకు భారతీయ విద్యా భవన్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్స్ వంటి ప్రముఖ సంస్థల స్థాయి వసతులు కల్పించాలని, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణంలో రాజీపడొద్దని ఆయన సూచనలు చేశారు.
ప్రభుత్వ స్కూల్స్ లో బ్రేక్ ఫాస్ట్ పథకంపై సీఎం కీలక ఆదేశం
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో బ్రేక్ఫాస్ట్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసి, విజయ డెయిరీ నుంచి పాలు తప్పనిసరిగా అందించాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను పెంచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించాలని సీఎం పేర్కొన్నారు. కోర్ అర్బన్ వెలుపల, రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల ప్రభుత్వ పాఠశాల తరహాలో రవాణాతో సహా అన్ని ఆధునిక సౌకర్యాలను కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు.
రవాణా కోసం ఎలక్ట్రికల్ బస్సుల ఏర్పాటుపై అధ్యయనం
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల రవాణా కోసం ఎలక్ట్రికల్ బస్సులను ఏర్పాటు చేయడంపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ సమీక్షలో ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్రెడ్డి, కే. కేశవరావు, విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, కళాశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన, ఏయూ వీసీ ప్రొఫెసర్ కుమార్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి వంటి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


