Andhra Pradesh
oi-Syed Ahmed
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (ys vivekananda reddy)హత్య జరిగి ఏడేళ్లు కావస్తోంది. ఓవైపు సీబీఐ తన దర్యాప్తు పూర్తయిందని సుప్రీంకోర్టుకు సైతం చెప్పేసింది. దీంతో ఛార్జిషీట్ దాఖలు చేసి విచారణ పూర్తి చేయాలనే ఆదేశాలు కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తన తండ్రి హత్యకు న్యాయం జరగడం లేదంటూ సునీత తాజాగా మీడియా ముందుకు వచ్చారు. దీనిపై ఇవాళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (ys avinash reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.
వివేకా గుండెపోటుతో చనిపోయారని నాటకం సృష్టించిందే సునీతారెడ్డి, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి అని అవినాష్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. వివేకా చనిపోయాక పోలీసులకు సమాచారం ఇచ్చింది తానే అన్నారు. ఈ కేసులో అనేక కీలక అంశాల్ని సునీత పక్కదారి పట్టించారన్నారు. వివేకాది మర్డర్ ఫర్ గెయిన్ అనే కోణంలో సునీత ఎందుకు విచారణ కోరలేదని అవినాష్ ప్రశ్నించారు. ఈ కేసులో సీబీఐ ఏకపక్షంగా దర్యాప్తు చేసిందని, తనకు వ్యతిరేకంగా తప్పుడు సాక్ష్యాలు చెప్పాలని సునీత పలువురిని ఒత్తిడి చేశారని అవినాష్ ఆరోపించారు.
చంద్రబాబుకు రాజకీయంగా అవసరం ఉన్నప్పుడు సునీత బయటికి వస్తారని, వచ్చే ఎన్నికల వరకూ ఈ కేసును సాగదీయాలనేది ఆమె ఆలోచన అని అవినాష్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసులో సునీత తప్పులు లేకపోతే దస్తగిరిని ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు. ఆయన బెయిల్ రద్దు కాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని అడిగారు. మూడేళ్లుగా ఈ కేసు విచారణ ముందుకెళ్లకుండా ఆమె అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పీఏ కృష్ణారెడ్డి ఇచ్చిన లేఖను సునీత పోలీసులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. వివేకా రెండో భార్యకు ఆస్తులు రాసిస్తారనే చెక్ పవర్ తీసేశారని, అందుకే హత్య చేయించి ఉండొచ్చన్న కోణంలో ఎందుకు దర్యాప్తు చేయడం లేదని సీబీఐని అవినాష్ ప్రశ్నించారు.


