Andhra Pradesh
oi-Syed Ahmed
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని చెప్పింది ఆయన కుమార్తె సునీతారెడ్డే అంటూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడటం దారుణమని పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల (ys sharmila) మండిపడ్డారు. సునీత చంద్రబాబు కోసం ఆరాటపడుతున్నారని అనడం అన్యాయమన్నారు. డబ్బు, పలుకుబడి ఉందన్న అహంకారంతో ఈ కేసు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. వివేకా చనిపోయిన రోజున 7 గంటల నుంచే సాక్షి టీవీలో ఆయన గుండెపోటు వార్తల్ని ప్రసారం చేశారన్నారు. హైదరాబాద్ లో ఉన్న తాను, సునీత ఈ వార్త చూసి షాక్ కు గురయ్యామని తెలిపారు.
పులివెందులలో స్థానికంగా ఉన్న అవినాష్ రెడ్డికే ఇది గుండెపోటు అని చెప్పే అవకాశం ఉంటుంది కానీ, తనకు గానీ, సునీతకు కానీ ఉండదని షర్మిల గుర్తుచేశారు. రక్తపు మడుగులో వివేకా శవం ఉన్నప్పుడు గుండెపోటు అని చెప్పే అవకాశం ఉండదన్నారు. పోస్టుమార్టం జరగకపోతే ప్రయోజనం సాక్షికే తప్ప దూరంగా ఉన్న సునీతకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. సాక్షి టీవీలో వివేకా గుండెపోటుతో మరణించారన్న వార్త ఎందుకు ప్రసారం చేసిందో భారతీరెడ్డి, అవినాష్ రెడ్డి సమాధాన చెప్పలేదన్నారు. వివేకానందరెడ్డి బతికిలేడన్న ఇంగితం కూడా లేకుండా ఆయన వ్యక్తిగత జీవితంపై వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తున్నారన్నారు.
వివేకాకు ఇంకో భార్య, కొడుకు ఉండొచ్చు కానీ, వాళ్లు ఎలా బతకాలనేది ఆయన ఎప్పుడో నిర్ణయించారన్నారు. ఇప్పుడు అవినాష్ రెడ్డి వాళ్లు ఎందుకు చంపి ఉండకూడదని ప్రశ్నిస్తున్నారని, కానీ వివేకా బతికి ఉంటేనే వాళ్లకు లాభమన్నారు. ఎందుకంటే అప్పటికే వివేకా ఆస్తుల్ని సునీత పేరు మీదే రాసేశారన్నారు. ఆయన పేరు మీద ఏమీ లేవన్నారు.వివేకా చనిపోతే రెండో కుటుంబానికి నష్టమే తప్ప లాభం లేదన్నారు. వివేకా హత్యను ఆయన అల్లుడు కమ్ బామ్మర్ది అయిన రాజశేఖర్ మీదే నిందలు వేస్తున్నారని, ఆయన ఎలాంటి వాడో అందరికీ తెలుసన్నారు.
వివేకా హత్య తర్వాత ఆయనది గుండెపోటు కాదు, సీబీఐ దర్యాప్తు కావాలని కోరిందీ జగన్మోహన్ రెడ్డి అని, సీఎం అయ్యాక సీబీఐ దర్యాప్తు అక్కర్లేదు, నేను వేసే సిట్ సరిపోతుందనీ చెప్పిందీ ఆయనే అన్నారు. అవినాష్ పై సీబీఐ దర్యాప్తు చేయిస్తే ఆయన బీజేపీలో చేరిపోతాడని చెప్పిందీ జగనే అన్నారు. అప్పటి నుంచీ సునీత కోర్టుకు వెళ్లి సీబీఐ దర్యాప్తు చేయించిందన్నారు. హత్యలో అవినాష్ రెడ్డి పాత్ర లేకుండా సునీత దంపతుల పాత్ర ఉంటే సీబీఐకి ఆధారాలు ఎందుకు దొరకలేదన్నారు. సీబీఐ అన్ని ఆధారాలు అవినాష్ మీదే ఎందుకు సీబీఐ సేకరించిందని ప్రశ్నించారు. జగన్ ఐదేళ్లు సీఎంగా ఉండి వివేకానుహత్య చేయించారని చెప్తున్న సునీత భర్తకు వ్యతిరేకంగా ఒక్కసాక్ష్యం కూడా ఎందుకు బయటపెట్టలేదన్నారు.
ఈ హత్య కడప ఎంపీ టికెట్ కోసమే జరిగిందని, వివేకా తన ఇంటికే వచ్చి రెండు గంటల పాటు తనతో దీనిపైనే చర్చించారన్నారు. అవినాష్ కు టికెట్ కరెక్ట్ కాదని వివేకా చెప్పారని, జగన్ కూ ఈ విషయం చెప్పినా వినకుండా ఆయనకే టికెట్ ఇచ్చారన్నారు. అయినా మద్దతిచ్చిన వివేకా ఎప్పటికీ తనకు అడ్డేనని భావించి అవినాష్, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఈ హత్య చేయించారన్నారు. ప్రాణహాని ఉన్నప్పటికీ సునీత పోరాడుతుంటే, అన్నగా కనికరం లేకుండా జగన్ దుష్ప్రచారం చేయిస్తున్నారన్నారు. వైఎస్ బతికుంటే ఎంత బాధపడేవారో తమకు తెలుసన్నారు. మీరు సీబీఐ దర్యాప్తుకు అంగీకరించకపోవడం వల్లే సునీత చంద్రబాబును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. అన్న అనే పదానికి జగన్ కళంకమని షర్మిల అభివర్ణించారు.


