Andhra Pradesh
oi-Sai Chaitanya
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి – వైసీపీ మధ్య కొత్త రాజకీయ వ్యూహాలు తెర మీదకు వస్తున్నాయి. కూటమి లక్ష్యంగా జగన్ విమర్శల తీవ్రత పెంచారు. అదే సమయంలో కూటమి 2029 ఎన్నికలే టార్గెట్ గా కార్యాచరణ అమలు చేస్తోంది. ఈ సమయంలోనే వైసీపీ నుంచి జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని వ్యవహారం పైన కొంత కాలంగా రాజకీయంగా చర్చ జరుగుతోంది. జనసేనలో చేరినా గుర్తింపు లేకపోవటంతో తిరిగి వైసీపీ లోకి వస్తారనే ప్రచారం వేళ.. బాలినేని స్పష్టత ఇచ్చారు.
మాజీ మంత్రి బాలినేని 2024 లో వైసీపీ లో ఓటమి తరువాత జనసేనలో చేరారు. ఎన్నికల ఫలితాల తరువాత ఓటింగ్.. ఈవీఎంల పైన అభ్యంతరాలు వ్యక్తం చేసారు. ఆ తరువాత పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. వైసీపీ పైన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అప్పటికే ఎంపీ సుబ్బారెడ్డితో ఉన్న విభేదాలతో బాలినేని ఆగ్రహంతో ఉన్నారు. అయితే, జనసేనలో చేరిన తరువాత స్థానికంగా టీడీపీ ఎమ్మెల్యే తో గ్యాప్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఒంగోలులో బాలినేని స్థానంలో వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ ను జగన్ నియమించారు.
తాజాగా జరిగిన పార్టీ ఒంగోలు సమీక్షలోనూ జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఒంగోలు అనగానే వాసన్న విషయంలో కొన్ని ప్రశ్నలు వస్తాయని వ్యాఖ్యానించారు. అదే సమయంలో వాసన్నా మళ్లీ వస్తాడా అంటూ జగన్ వ్యాఖ్యానించి నట్లు తెలిసింది. దీంతో.. బాలినేని వైసీపీలోకి రీ ఎంట్రీ ఖాయమేనా అనే ప్రచారం మొదలైంది.
పవన్ తో భేటీ తరువాత బాలినేని క్లారిటీ
కాగా, ఈ సమయంలోనే తన కుమారుడు తో కలిసి బాలినేని తాజాగా డిప్యూటీ సీఎం పవన్ తో సమావేశం అయ్యారు. సుదీర్ఘంగా చర్చించారు. ఒంగోలులో పరిస్థితులను వివరించారు. ఆ తరువాత బాలినేని చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. తాను వైసీపీలో రీ ఎంట్రీ ఇస్తున్నానే ప్రచారం వేళ.. ఎక్కడా వైసీపీ పేరు ప్రస్తావన చేయకుండానే తన మనసులో మాట ఏంటో స్పష్టం చేసారు. ఈ మేరకు బాలినేని చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
ఆయన మాకు ఒక నాయకుడు మాత్రమే కాదు… నమ్మకం, ఆదరణ, ఆశ్రయం..@JanaSenaParty @PawanKalyan pic.twitter.com/wkjgtK0GCS
— Balineni Srinivasa Reddy (@balineni_vasu) March 19, 2026
ఆ ట్వీట్ లో పవన్ తో ఉన్న ఫొటోలను జత చేసిన బాలినేని..’ ఆయన మాకు ఒక నాయకుడు మాత్రమే కాదు… నమ్మకం, ఆదరణ, ఆశ్రయం..’ అని పేర్కొన్నారు. దీని ద్వారా తన కుమారుడితో కలిసి పవన్ ను కలవటం ద్వారా.. తనయుడికి రాజకీయంగా స్పష్టమైన హామీ పొందినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా బాలినేని తాజాగా ట్వీట్ ద్వారా పవన్ తోనే తమ రాజకీయంగా కొనసాగుతామని స్పష్టం చేసినట్లు విశ్లేషణలు మొదలయ్యాయి.


