Andhra Pradesh
oi-Sai Chaitanya
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. మాజీ సీఎం జగన్ లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తోంది. కూటమిని టార్గెట్ చేస్తూ జగన్ కొత్త వ్యూహాలతో సిద్దం అవుతున్నారు. ఇదే సమయంలో రెండు వైపులా రాజకీయంగా కొత్త ప్రణాళికలు అమలు చేస్తున్నారు. గతంలో వైసీపీలో కీలకంగా వ్యవహరించి.. ఆ తరువాత పార్టీ వీడిన సీనియర్ నేతలు తిరిగి సొంత గూటికి చేరేందుకు మంత్రాంగం సాగుతోంది. అందులో భాగంగా ప్రకాశం జిల్లా ముఖ్య నేత తిరిగి వైసీపీలోకి రావటం ఖాయంగా తెలుస్తోంది.
2029 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తరువాత జగన్ సన్నిహితులతో పాటుగా పలువురు పార్టీ వీడారు. కూటమి పార్టీల వైపు మొగ్గు చూపారు. అయితే, కొందరు కూటమి పార్టీల్లో చేరినా.. ఇప్పటికీ తమకు తగిన గుర్తింపు లేదని వాపోతున్నారు. కాగా.. 2024 ఎన్నికల సమయంలో సీట్లు రాని కారణంగా పార్టీ మారిన వారిలోనూ ఇప్పుడు ఆలోచన మారినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ నేత ఆమంచి కృష్ణమోహన్ త్వరలోనే వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. ఇటీవల మాజీ మంత్రి అంబటి రాంబాబును కలిసిన సమయంలో నేతల మధ్య కూడా చర్చ జరిగినట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో చీరాల నుంచి పోటీ చేయడానికి అవకాశం ఇస్తే తాను వైసీపీలో చేరడానికి సిద్ధమని ఆమంచి కృష్ణమోహన్ ఇప్పటికే పార్టీ నాయకత్వానికి ఈ మేరకు సంకేతాలు పంపారని వైసీపీలో చర్చ జరుగుతోంది. వైసీపీ లో చీరాల ఇంఛార్జ్ గా ఉన్న కరణం కుటుంబం యాక్టివ్ గా లేరు. కరణం వెంకటేశ్ ను అద్దంకి నియోజకవర్గానికి పంపాలన్నది జగన్ ఆలోచనగా తెలుస్తోంది.
చీరాల పై హామీ ఇస్తే సిద్దం అంటూ సంకేతాలు
దీంతో, తిరిగి చీరాలకు ఆమంచి కృష్ణమోహన్ కు అవకాశం కల్పిస్తే బాగుంటుందని జగన్ కూడా భావిస్తుందని అనుకుంటున్నారు. అందులో భాగంగానే ఆమంచి కి కొందరు ప్రకాశం వైసీపీ నేతల ద్వారా సమాచారం పంపారని చెబుతున్నారు. అయితే ముహూర్తం చూసుకుని చేరాలని ఆమంచి కృష్ణమోహన్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 2024 ఎన్నికలకు ముందు ఆమంచి కృష్ణమోహన్ ను పర్చూరు నియోజకవర్గానికి ఇన్ ఛార్జిగా నియా మకం తో ఆయన దూరం జరిగారు. కొంత కాలంగా ఆమంచి జనసేనలో చేరే అవకాశం ఉందనే ప్రచారం సాగింది. అయితే, కూటమి పార్టీలు చీరాలతో తమ సొంత వారిని కాదని ఆమంచికి సీటు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. కాగా.. ఇటీవల పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చీరాల పర్యటనలో కూడా ఆమంచి కృష్ణమోహన్ పాల్గొన్నారు. అయితే ఆయన వైసీపీలో చేరాలంటే తనకు స్పష్టమైన హామీని ఇవ్వాలని, అది జగన్ ఇచ్చిన తర్వాత మాత్రమే పార్టీలోకి వస్తానని చెప్పినట్లు తెలిసింది. అదే విధంగా.. పార్టీ వీడిన ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు అనంతపురం కు చెందిన మరో ఇద్దరు సీనియర్లు సైతం తిరిగి వైసీపీలోకి వచ్చేందుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.


