Andhra Pradesh
oi-Sai Chaitanya
Tirumala: తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. సొంత వాహనాల్లో తరలి రావటంతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాల రద్దీ పెరిగిపోయింది.సెలవులు కావటంతో తిరుమల దారులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అలిపిరి ముఖద్వారం వరకు వాహనాలు బారులు తీరాయి. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. ఇదే సమయంలో శ్రీవారి ఆలయంలో పురాతన మండపాల విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. సర్వదర్శనం కంపార్టు మెంట్లు నిండి కృష్ణతేజ సర్కిల్ వరకు భక్తులు వేచి ఉన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో పురాతన మండపాల్లోని రాతి స్తంభాలు, రాతి పైకప్పును శుభ్రపరచడంతో పాటు పగుళ్లను శాస్త్రీయపద్ధతుల్లో సరిచేసి సంరక్షించేందుకు పూణేకు చెందిన ఓ సంస్థ ముందుకు వచ్చింది. పూర్తిగా విరాళం పద్ధతిలో ఈ పనులు చేపట్టేందుకు ఆ ట్రస్టు సిద్ధమైన క్రమంలో టీటీడీ బోర్డు కూడా ఇటీవల ఆమోదం తెలిపింది. ఆలయంలోని రంగనాయక మండపం, కల్యాణోత్సవ మండపం, పాత పరకామణి మండపాల్లో పురాతన రాతి స్తంభాలు, రాతి ఉపరితలం, ఇతర రాతి నిర్మాణాలను కొన్ని రకాల రసాయనాలతో శుభ్రపరచడంతో పాటు పగుళ్లను అరికట్టి సంరక్షించే లా పూణేకు చెందిన లార్డ్ వేంకటేశ్వర ఝ్ఛరిటబుల్ అండ్ రిలీజియస్ ట్రస్టు(ఎల్వీసీఆర్టీ) ముందుకొచ్చింది.
మండపాల పునరుద్దరణ దిశగా చర్యలు
కాగా, ఈ పనులకయ్యే ఖర్చు మొత్తం ఆ ట్రస్టు భరిస్తుందని టీటీడీ ఇంజనీరింగ్ విభాగం బోర్డు దృష్టికి తీసుకురావడంతో ఆమోదం లభించింది. కాగా, ఇదే ట్రస్టు ప్రస్తుతం అలిపిరి పాదాల మండపాన్ని శాస్రీయ పద్ధతిలో పునర్నిర్మాణ పనులు చేస్తున్నారు. అయితే.. ఈ పునరుద్దరణ పనులను విరాళం రూపంలో చేపట్టనుంది. రంగనాయక మండపంలోని నాలుగు స్తంభాలను ఇప్పటికే ప్రయోగాత్మకంగా పైలెట్ బేసిస్ శుద్ది చేయగా.. వాటి రూపం అద్భుతంగా మారిందని చెబుతున్నారు. ఈ ఫలితాలు చూసిన తరువాత ఈ ప్రాజెక్టకు ఆమోదం తెలిపింది. పూనే సంస్థతో ఒప్పందం కు నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక రసాయనాలతో స్తంభాల పై ఉన్న జిడ్డు.. మసిని తొలి గిస్తారు. ఆధునిక సిమెంట్ వాడకాన్ని పక్కన పెట్టి.. సంప్రదాయ పద్దతిలో సున్నపు గారతో పగుళ్లు పూడ్చనున్నారు. వకులామాత పోటులో వేడి ప్రభావం తగ్గించేందుకు హీట్ షీల్స్, మెరుగైన ఎగ్జాస్ట్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు.


