Telangana
oi-Sai Chaitanya
TGSRTC కీలక నిర్ణయం తీసుకుంది. అటు ఉద్యోగ సంఘాలు తమ పెండింగ్ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె నోటీసు ఇచ్చాయి. 13వ తేదీన సమ్మె నోటీసు ఇచ్చిన ఆర్టీసీ జేఏసీ నేతలు 14 రోజుల తరువాత సమ్మెకు వెళ్తామని హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగులకు సంబంధించి తెలంగాణ ఆర్టీసీ మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు చాలా కాలంగా అమలు చేస్తున్న విధానం రద్దు చేసారు.
తెలంగాణ ఆర్టీసీ తాజాగా తీసుకున్న నిర్ణయం పైన చర్చ మొదలైంది. ఉద్యోగులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే ప్రత్యేక ప్రోత్సాహకం కింద ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇప్పటివరకూ ఇస్తున్నారు. ఇప్పుడు దానిని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అధికారులు. ఇకపై తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నప్పటికీ ప్రత్యేకంగా ఏవిధమైన బెనిఫిట్ ఉండదు. గతంలోనే ప్రభుత్వం ఇటువంటి ఇంక్రిమెంట్స్ నిలిపివేసింది. అయితే, ఆర్టీసీ కార్పొరేషన్ కావడంతో ఇక్కడ ఇప్పటివరకూ అది అమలులోకి రాలేదు. తాజాగా ప్రభుత్వ నిబంధనలకు సమానంగా కార్పొరేషన్ లోని నిబంధనలు కూడా ఉండాలనే విధానంలో భాగంగా టీజీఎస్ ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఒక్కరు లేదా ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత స్టెరిలైజేషన్ చేయించుకుంటే ఉద్యోగులు లేదా వారి జీవిత భాగస్వాములకు పర్సనల్ సాలరీ రూపంలో ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇచ్చేవారు.
TGSRTC తాజా నిర్ణయం వెనుక
అయితే, రాష్ట్ర ప్రభుత్వం 1998లోనే ఈ పథకాన్ని నిలిపివేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ పథకం నిలిపివేసినా.. ఇప్పటికీ విభజన తరువాత కూడా దీనిని టీజీఎస్ ఆర్టీసీ కొనసాగిస్తూ వస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న విధానంలో వైరుధ్యాలను తొలగించడం లక్ష్యంగా ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. సవరించిన ఉత్తర్వుల ప్రకారం, మార్చి 17, 2026న లేదా ఆ తర్వాత కుటుంబ నియంత్రణ ప్రక్రియలు చేయించుకునే ఉద్యోగులు ఇకపై ఈ ప్రోత్సాహక ఇంక్రిమెంట్ కు అర్హులు కారు. కుటుంబ నియంత్రణ కోసం ఇస్తున్న ఈ ఇంక్రిమెంట్ నిలిపివేసినా.. కొన్ని సంక్షేమ నిర్ణయాలు కొనసాగుతాయని స్పష్టం చేసారు. తాజా నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులందరినీ ఆదేశించింది.


