Andhra Pradesh
oi-Dr Veena Srinivas
తెలుగు రాష్ట్రాలలో చికెన్ ధరలు షాక్ ఇస్తున్నాయి. కోళ్ళ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఒకపక్క కోడిగుడ్ల ధరలు తగ్గుతుంటే మరోపక్క చికెన్ ధరలు పెరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇరాన్ ఇజ్రాయిల్ అమెరికా యుద్ధ కారణంగా ఎగుమతులు లేక కోడిగుడ్ల ధరలు తగ్గాయి. కానీ ఇదే స్థాయిలో చికెన్ ధరలు పెరిగాయి.
సామాన్యులకు షాక్ ఇస్తున్న చికెన్ ధరలు
ఇటీవల రోజుల్లో ఊహించని విధంగా చికెన్ ధరలు పెరిగాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో బహిరంగ మార్కెట్లో కేజీ చికెన్ ధర 320 రూపాయలకు చేరింది. చికెన్ ధర 300 రూపాయల మార్కును అధిగమించడం సామాన్యులకు పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇక చాలా చోట్ల చికెన్ కొనుగోలుదారులు, మండుతున్న ధరలను చూసి చికెన్ కొనుగోలు చేయకుండా వెళ్ళిపోతున్నారు.ఆ ధరకు అరకిలో దాకా మటన్ వస్తుందని భావిస్తున్నారు.
బాగా తగ్గిన చికెన్ ఉత్పత్తి
అయితే పౌల్ట్రీ పరిశ్రమలో ఉత్పత్తి తగ్గడం, పౌల్ట్రీ ఫారాల నుంచి సరఫరా కూడా తగ్గడం వంటి కారణాలతో పాటు, ప్రస్తుతం రంజాన్ మాసం కావడంతో హర్రీస్ తయారు చేయడానికి కోళ్లను గణనీయంగా ఉపయోగించే క్రమంలో అవసరానికి తగ్గట్టుగా చికెన్ ఉత్పత్తి జరగడం లేదనే అభిప్రాయం ఉంది. కోళ్లఫారాల నిర్వాహకులు కోళ్లదాణా ఖర్చులు పెరగడం, రవాణాఖర్చులు పెరగడం వంటి అనేక కారణాలతో వ్యాపారం లాభదాయకంగా లేకపోవడంతో కోళ్ల ఉత్పత్తిని బాగా తగ్గించేశారు.
డిమాండ్ కు తగిన సరఫరా లేక పెరిగిన ధరలు
దీంతో అవసరానికి తగిన ఉత్పత్తి లేకపోవడంతో చికెన్ ధరలు విపరీతంగా పెరిగాయి. 300 రూపాయలకు మించి చికెన్ ధరలు పెరగడంతో సామాన్యులు అహనా పెళ్ళంట సినిమాలోలా కోడిని వేలాడగట్టుకుని చూసి అన్నం తినే రోజులు వచ్చాయని లబోదిబోమంటున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే చికెన్ కొనలేని పరిస్థితి వస్తుందని అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సామాన్యులకు భారంగా చికెన్ ధరలు
అసలే ఎండాకాలం, బాగా గణనీయంగా తగ్గుతున్న ఉత్పత్తితో రాబోయే కొన్ని నెలల్లో కిలో చికెన్ ధర 380 రూపాయల వరకు చేరే అవకాశం ఉందని వ్యాపారుల అంచనా. భవిష్యత్తులో చికెన్ ధరలు సామాన్యులకు మరింత భారంగా మారతాయని ప్రజలు ఆందోళనలో ఉన్నారు. అయితే కోళ్ళ ఫారాల నిర్వాహకులు మాత్రం ఈ నష్టాల వ్యాపారాలు చేయలేమని అంటున్నారు.


