Telangana
oi-Dr Veena Srinivas
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పదవి గండం ఉందని, ఆయన పదవికి మంత్రివర్గంలోని మరో మంత్రి కారణంగా ముప్పు పొంచి ఉందని సిపిఐ ముఖ్య నాయకుడు నారాయణ అన్నారు. ఖమ్మం జిల్లాలోని ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న ఆయన ఎన్నికల ప్రచారంలో సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒంటెద్దు పోకడలు పోతుందని సిపిఐ నారాయణ అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి పదవికి ముప్పు ఉంది: సీపీఐ నారాయణ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవికి ముప్పు ఉందని దానికి రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కారణమని ఆయన వ్యాఖ్యలు చేశారు. జాతీయ స్థాయిలో సిపిఐతో పొత్తు ఉన్నప్పటికీ, ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి బాలేదని ఆయన అన్నారు. ఐదేళ్ల క్రితం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో గుర్తుంచుకోవాలని తరచూ పార్టీలు మారే వారికి ప్రజలలో గుర్తింపు ఉండదని ఆయన అన్నారు.
తల్లిపాలకు డబ్బా పాలకు పోటీ
ఖమ్మం జిల్లా కమ్యూనిస్టులకు కంచుకోట అని వ్యాఖ్యలు చేసిన సిపిఐ నారాయణ కమ్యూనిస్టులు తల్లిపాల వంటి వారు అంటూ స్వచ్ఛమైన వారని నారాయణ అభివర్ణించారు. ప్రస్తుతం తల్లిపాలకు డబ్బా పాలకు మధ్య పోటీ జరుగుతోందంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. కొత్తగూడెం కార్పొరేషన్ లో సిపిఐ గెలిస్తే సీఎం పదవి పోతుందా అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
పొత్తులు పెట్టుకోనిది అందుకేనా
రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు కాంగ్రెస్ కే దక్కాలి ఉన్న దురుద్దేశంతోనే ఇక్కడ పొత్తులను నిరాకరించారు అంటూ ఆయన ఆరోపించారు. కొత్తగూడెం ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని, సమస్యలు పరిష్కరించే కమ్యూనిస్టులను గెలిపించాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పదవీ గండం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు సిపిఐ నారాయణ.
రాజకీయ వర్గాలలో సీపీఐ నారాయణ వ్యాఖ్యలపై చర్చ
ఇక తాజాగా నారాయణ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికర చర్చకు కారణంగా మారాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది అన్న చర్చకు కారణమయ్యాయి. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రశాంతంగా లేరనే అభిప్రాయం తాజా నారాయణ వ్యాఖ్యలతో అర్ధం అవుతుంది.


