India
oi-Chandrasekhar Rao
నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఏప్రిల్ 9వ తేదీన కేరళ, అదే నెల 23వ తేదీన తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఒకేదశలో ఇవి ముగుస్తాయి. మే 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఈ వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నికలు ఎదుర్కొంటోన్న నాలుగు రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ కూడా ఉంది. ఈ రాష్ట్రంతో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరీ ఉన్నాయి.
ఈ ఎన్నికల ప్రకటనతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎమ్సీసీ) తక్షణమే అమలులోకి వచ్చింది. షెడ్యూల్ విడుదలైన మరుసటి రోజే పలు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఈసీ లేఖ రాసింది. అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ సహా ఉప ఎన్నికలను ఎదుర్కొంటోన్న ఆరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ప్రధాన ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వానికి కూడా ఎమ్సీసీ వర్తిస్తుందని, ఈ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది.
ఎమ్సీసీ నిబంధనలను కఠినంగా అమలు చేయడంలో భాగంగా ప్రభుత్వ, బహిరంగ, ప్రైవేటు ఆస్తులపై రాతలు, పోస్టర్లను తక్షణమే తొలగించాలని ఆదేశించింది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రభుత్వ వాహనాలు, వసతులను దుర్వినియోగం చేయకూడదు. అలాగే, ప్రజాధనంతో ప్రకటనలు జారీ చేయడాన్ని ఎన్నికల సంఘం నిషేధించింది. పౌరుల గోప్యతకు భంగం కలిగించకూడదని, ప్రైవేటు నివాసాల వెలుపల నిరసనలు, ధర్నాలు నిషేధంమని తెలిపింది.
యజమాని అనుమతి లేకుండా ఇతరుల భూమి, భవనాలు లేదా గోడలను జెండాలు, బ్యానర్లు, పోస్టర్ల కోసం ఉపయోగించరాదని ఈసీఐ స్పష్టం చేసింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై ప్రజల నుండి అందే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రత్యేక వ్యవస్థను ఈసీఐ ఏర్పాటు చేసింది. ప్రజలు, రాజకీయ పార్టీలు కాల్ సెంటర్ 1950 ద్వారా లేదా ఈసీఐఎన్ఈటీలోని సీవిజిల్ యాప్ ద్వారా నేరుగా సంబంధిత డీఈఓ/ఆర్ఓలకు ఫిర్యాదు చేయవచ్చు.
ఫిర్యాదులపై 100 నిమిషాల్లో స్పందించేందుకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 5,173 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఈసీఐ మోహరించింది. అదనంగా 5,200 స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలను (ఎస్ఎస్టీలు) కూడా రంగంలోకి దించింది. ఇవి ఎన్నికల ఉల్లంఘనలను పర్యవేక్షిస్తాయి. రాజకీయ పార్టీలు తమ సమావేశాలు, ఊరేగింపుల గురించి పోలీసులకు ముందుగా తెలియజేయాలి. ట్రాఫిక్, భద్రతా ఏర్పాట్లకు ఇది తప్పనిసరి. ఈ నిషేధాజ్ఞలను పాటించాల్సి ఉంటుంది. లౌడ్స్పీకర్లు వంటి సౌకర్యాలకు అనుమతులు పొందాలని ఈసీఐ ఆదేశించింది.
మంత్రులు అధికారిక విధులను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించకూడదు. ప్రచారానికి ప్రభుత్వ యంత్రాంగం, రవాణా, సిబ్బందిని వినియోగించడం నిషేధమని ఈసీఐ ఆదేశించింది. ఎమ్సీసీని అమలు చేయడంలో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. అన్ని పార్టీలకు సమాన ప్రాపక్యం కల్పిస్తూ, అధికారిక సౌకర్యాల దుర్వినియోగాన్ని నివారించాలి.
సమావేశాలు, ఊరేగింపులు, పోలింగ్ ఏర్పాట్లను నిష్పక్షపాతంగా నియంత్రించి, శాంతిభద్రతలను కాపాడి, ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతను నిలబెట్టాలని ఈసీఐ ఆదేశించింది. ఈసీఐఎన్ఈటీలో సువిధ మాడ్యూల్ను రాజకీయ పార్టీల కోసం ప్రారంభించారు. మైదానాలు, హెలిప్యాడ్లు వంటి బహిరంగ ప్రదేశాలను ఉపయోగించుకోవడానికి దరఖాస్తులను ముందుగా వచ్చిన వారికి ముందుగా ప్రాతిపదికన కేటాయిస్తారు.


