Telangana
oi-Lingareddy Gajjala
“పిల్లల భవిష్యత్తు కోసం చేసే ఖర్చు పెట్టుబడి మాత్రమే కాదు, అది రేపటి సమాజానికి పునాది” అనే నినాదంతో తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగంలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్లో విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేశారు. ముఖ్యంగా పేద విద్యార్థులకు బాసటగా నిలుస్తూ, వారి పోషణ, విద్యా ఫలితాలను మెరుగుపరిచేందుకు రెండు విప్లవాత్మక పథకాలను ప్రభుత్వం ప్రకటించింది. విద్యా రంగానికి ఏకంగా రూ.26,674 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తూ, ప్రతి బిడ్డ కలలకు జీవం పోసే దిశగా అడుగులు వేసింది.
రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల కోసం 2026-27 విద్యా సంవత్సరం నుంచి నూతనంగా ‘బ్రేక్ఫాస్ట్’ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రీ-ప్రైమరీ స్థాయి నుండి ఇంటర్మీడియట్ వరకు ఉన్న ప్రతి విద్యార్థికి ఉదయం పూట నాణ్యమైన పోషకాలను అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. దీని ప్రకారం వారానికి మూడు రోజులు స్వచ్ఛమైన పాలు, మిగిలిన మూడు రోజులు శక్తినిచ్చే రాగిజావను విద్యార్థులకు అందిస్తారు. ఆకలితో కాకుండా, ఆరోగ్యవంతమైన మేధస్సుతో విద్యార్థులు తరగతి గదుల్లో అడుగుపెట్టాలనేది ప్రభుత్వ సంకల్పం.
ఇంటర్ విద్యార్థులకు తీపి కబురు..
రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే మరో కీలక సంస్కరణగా, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు కూడా ఇకపై మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరిస్తున్నట్లు ఆర్థిక మంత్రి భట్టి ప్రకటించారు. కౌమార దశ (Adolescence) అనేది శారీరక, మానసిక వికాసానికి అత్యంత కీలకమైన సమయం. ఈ వయస్సులో సరైన పోషకాహారం అందకపోతే అది వారి నేర్చుకునే సామర్థ్యాన్ని, దీర్ఘకాలిక ఆయుష్షును దెబ్బతీస్తుందని గుర్తించిన ప్రభుత్వం, ఈ సాహసోపేత నిర్ణయం తీసుకుంది. వేలాది మంది పేద విద్యార్థులకు ఈ నిర్ణయం కొండంత అండగా నిలవనుంది.
ఆధునిక వంటశాలలు.. అనారోగ్యానికి చెక్..
కేవలం ఆహారం అందించడమే కాకుండా, అది వండే పరిసరాలు కూడా అత్యంత శుభ్రంగా ఉండాలని ప్రభుత్వం భావించింది. రాష్ట్రంలోని వసతి గృహాలు (Hostels), గురుకుల విద్యాసంస్థల్లోని వంటశాలల అపరిశుభ్రత వల్ల విద్యార్థులు తరచూ అనారోగ్యం పాలవుతున్నారన్న ఫిర్యాదులపై ప్రభుత్వం స్పందించింది. వీటిని శాశ్వతంగా పరిష్కరించి, వంటశాలలను అత్యాధునికీకరించడానికి ఈ బడ్జెట్లో రూ.100 కోట్ల రూపాయలను ప్రత్యేకంగా కేటాయించింది. దీని ద్వారా విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణంలో వండిన ఆరోగ్యకరమైన ఆహారం అందనుంది. తెలంగాణ విద్యార్థులు ప్రపంచ స్థాయి మేధావులుగా ఎదగడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ‘పెట్టుబడి’ని పెట్టింది.


