International
oi-Chandrasekhar Rao
హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి అమెరికా.. సైనిక చర్యలు చేపట్టింది. హార్ముజ్ స్ట్రెయిట్ సమీపంలో గల ఇరాన్ క్షిపణి స్థావరాలపై దాడికి దిగింది. అత్యంత శక్తివంతమైన బాంబులను జారవిడిచింది. ఇరాన్ తీరం వెంబడి జలసంధికి సమీపంలోని పటిష్టమైన క్షిపణి స్థావరాలపై 5,000 పౌండ్ల డీప్ పెనట్రేటర్ బాంబులను సంధించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంటాక్) ప్రకటించింది. అదే సమయంలో ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడులను నిర్ధారించారు. త్వరలోనే హార్ముజ్ జలసంధికి విముక్తి కల్పిస్తామని అన్నారు.
ఈ దాడుల వివరాలను సెంట్రల్ కమాండ్ ఎక్స్ లో వెల్లడించింది. హార్ముజ్ జలసంధి, ఇరాన్ తీరప్రాంతంలోని పటిష్టమైన క్షిపణి స్థావరాలపై 5,000 పౌండ్ల డీప్ పెనట్రేటర్ ఆయుధాలను విజయవంతంగా ప్రయోగించినట్లు తెలిపింది. అవన్నీ కూడా టార్గెట్లను తాకాయని వివరించింది. ఆయా స్థావరాలలో ఉన్న ఇరాన్ యాంటీ-షిప్ క్రూయిజ్ క్షిపణులు అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు తీవ్ర ముప్పుగా పరిణమించడం వల్లే ఈ దాడి చేయాల్సి వచ్చిందని స్పష్టం చేసింది.
ఈ బాంబు దాడులు- హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన తర్వాత చోటు చేసుకున్నాయి. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ను తిరిగి అందుబాటులోకి తీసుకుని రావడానికి అమెరికా, ఇజ్రాయెల్ ఈ సైనిక చర్యకు దిగాయి. ఈ రెండు దేశాలు యుద్ధం ప్రకటించిన వెంటనే ఇరాన్ దీన్ని మూసివేసిన విషయం తెలిసిందే. ఒక్క భారత్ షిప్పింగ్ కు తప్ప మిగిలిన వాటికి ఈ హార్ముజ్ జలసంధి గుండా రాకపోకలు సాగించడానికి అనుమతి లేదు.
ప్రపంచ చమురు రవాణాలో అయిదో వంతు ఈ జలసంధి గుండానే జరుగుతుంది. దీని మూసివేత కారణంగా సముద్ర రవాణా తీవ్రంగా ప్రభావితమౌతోంది. ప్రపంచ ఇంధన ధరలను అసాధారణంగా పెంచేసింది. హార్ముజ్ జలసంధి భద్రత కోసం సహాయం చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరినా కూడా నాటో సహా ఇతర మిత్రదేశాలు పెద్దగా స్పందించలేదు. ఆయన ఇచ్చిన పిలుపును తిరస్కరించాయి.
దీంతో అమెరికా నేరుగా సైనిక చర్యలకు దిగింది. చమురు ఎగుమతులు, రవాణాపై ఉన్న దిగ్బంధనాన్ని తగ్గించడమే దీని ముఖ్య ఉద్దేశమని సెంటాక్ తెలిపింది. నాటో నుండి సహాయం అందకయినప్పటికీ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ త్వరలో విముక్తి కల్పిస్తామని డొనాల్డ్ ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. దీనికి ఎక్కువ కాలం పట్టదని అన్నారు. హార్ముజ్ తీరాన్ని ధ్వంసం చేస్తున్నామని ప్రకటించారు. సెంటాక్ దాడులు ఆరంభమైన కొద్దిసేపటికే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకంది.
హార్ముజ్ జలమార్గాన్ని సురక్షితంగా మలచడానికి ఎటువంటి ప్రణాళికలు లేదా నిర్దుష్ట సమయాన్ని ఏమిటనేది ఆయన వెల్లడించలేదు. త్వరలోనే దాన్ని ఇరాన్ నుండి స్వేచ్ఛ కల్పిస్తామని వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్తో సహా మధ్యప్రాచ్య దేశాలను ట్రంప్ ప్రశంసించారు. అద్భుతంగా పనిచేశాయని కితాబిచ్చారు. గల్ఫ్ దేశాలు చాలా సహకరించాయని పేర్కొన్నారు.


