Telangana
oi-Bomma Shivakumar
హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయనపై డిఫమేషన్ కేసు వేసి కోర్టుకు లాగుతానని హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హైడ్రా అనే మహమ్మారి మొదలైందని.. అది పేదలను కబళిస్తోందని అన్నారు.
మూసీలో నిర్మించిన ఆదిత్య కన్ స్ట్రక్షన్ కు చెందిన బిల్డింగ్ వద్ద ఇటీవల నిర్వహించిన ధర్నాపై హైడ్రా తప్పుడు ప్రచారం చేసిందని కవిత మండిపడ్డారు. గతంలో రంగనాథ్ చేసిన ఆరోపణలనే చేస్తూ తాను ధర్నా చేస్తే తనపై తప్పుడు ప్రచారం చేస్తారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగనాథ్ సరిగ్గా ఆరు నెలల క్రితమే ఇదే ఆదిత్య కన్ స్ట్రక్షన్ బిల్డింగ్ యాజమాన్యం 0.37 ఎకరాలు ఆక్రమించిందంటూ తహసీల్దార్ కు రాసిన లేఖను ప్రస్తావించారు.
అంతేకాకుండా ఈ భవన నిర్మాణాన్ని ఆపకపోతే అందులో ఉండేబోయే వారితో పాటు ఆ చుట్టుపక్కల ప్రజల ప్రాణాలకే ప్రమాదమని లేఖ రాయలేదా..? అని కవిత ప్రశ్నించారు. వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలను తాను సోషల్ మీడియాలో పెడతానని హెచ్చరించారు. అప్పుడు రంగనాథ్, కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడైనా దూకి చావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు తన ధర్నాకు సంబంధించి హైడ్రా పెట్టిన వీడియోలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే కచ్చితంగా కోర్టుకు ఈడుస్తానని రంగనాథ్ ను కవిత హెచ్చరించారు.
నిజం మాట్లాడే వాళ్లదే తప్పు అన్నట్టుగా వీడియోలు ఎడిట్ చేసి ఎదురుదాడి చేస్తారా..? అని కవిత ప్రశ్నించారు. ప్రభుత్వానికి బాకాలు ఊదే వాళ్లు కూడా తాను ప్రైవేట్ ప్రాపర్టీలో ధర్నా ఎందుకు చేస్తున్నానని ప్రశ్నిస్తున్నారని.. మూసీ ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు కాబట్టే బాధ్యతాయుతమైన సంస్థగా హైదరాబాద్ ను పరిరక్షించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.
మరోవైపు హైడ్రా పేదవాళ్ల ఇళ్లను కూల్చుతూ పెద్దవాళ్ల జోలికి వెళ్లటం లేదని కవిత మండిపడ్డారు. పేదవాళ్ల పక్షాన తాము కచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పారు. హైడ్రాకు దమ్ముంటే తాను ఇప్పటి వరకు ఆధారాలతో సహా 6 కంప్లైంట్స్ చేశానని వాటిపై ఒక్క చర్య కూడా ఎందుకు తీసుకోలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పైగా సిగ్గు లేకుండా పోరాటం చేస్తున్న వారిపైనే తప్పుడు వీడియోలు చేస్తారా..? అని మండిపడ్డారు.
ఈ ప్రభుత్వం, హైడ్రా ఏమైనా గ్రాఫిక్స్ డిజైనర్లా..? కంటెంట్ క్రియేటర్లా..? అని కవిత ప్రశ్నించారు. తాను ఆధారాలు లేకుండా ఏదీ మాట్లాడనని స్పష్టం చేశారు. గతేడాదిలో ఆదిత్య కన్ స్ట్రక్షన్స్ వాళ్లు నాలా కబ్జా చేశారని అన్నది రంగనాథ్ కాదా..? అని కవిత గుర్తు చేశారు. ప్రజందరికీ ఒకే రూల్ ఉండాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. పేదలను కొట్టి పెద్దవాళ్లకు భూములు పంచుతామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
మూసీ ప్రక్షాళనతో ప్రయోజనం ఏంటో చెప్పాలి?
అటు మూసీ ప్రక్షాళన పేరుతో ప్రజాధనం దోపిడీకి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని కవిత అన్నారు. రెండు రోజుల క్రితం ప్రభుత్వం ఇచ్చి న ప్రజెంటేషన్ లో ఎక్కడ కూడా మూసీ ప్రక్షాళన కారణంగా జరిగే మేలు ఏంటో చెప్పలేదని గుర్తు చేశారు. ప్రపంచ బ్యాంక్ కు తాకట్టు పెట్టేందుకే ఈ ప్రాజెక్ట్ చేపట్టారని గతంలోనే తాను అసెంబ్లీలో చెప్పానని కవిత అన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన ప్రజెంటేషన్ లో ఫేజ్-1 కే దాదాపు 6 వేల 5 వందల కోట్ల నుంచి 7 వేల కోట్లు ఖర్చు అవుతుందని ఇచ్చారని.. కానీ ఆరు నెలల క్రితం మాత్రం 5, 641 కోట్లు అని చెప్పారన్నారు. ఆరు నెలల్లో 14 వందల కోట్లు ఎందుకు పెరిగిందో ప్రజలకు సమాధానం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. పైగా ఈ ప్రాజెక్ట్ లో ఎస్టీపీల నిర్మాణం, మూసీలో మురుగు నీరు కలిసే 16 నాలాల ప్రస్తావన, పరిహారం గురించి మాట్లాడలేదని అన్నారు. అంటే వాటికి అదనంగా ఖర్చు చేయబోతున్నారని విమర్శించారు.
ఇంతా చేస్తే అసలు ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రజలకు ఏం మేలు జరుగుతుందో అన్నది ప్రభుత్వం చెప్పలేకపోతుందన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ లో భాగంగా గత ప్రభుత్వం రివర్ బెడ్ లో 30 లక్షల స్వేర్ ఫీట్ల నిర్మాణం చేపడతామంటే అనుమతి ఇవ్వలేదన్న విషయాన్ని కవిత గుర్తు చేశారు. కానీ ఈ ప్రభుత్వం ఫేజ్-1 లోనే 18 లక్షల స్క్వేర్ ఫీట్ల నిర్మాణం చేపడితే ఎలా అనుమతిచ్చారని..దీని వెనుక జరిగిన మాయాజాలం ఏంటనీ ప్రశ్నించారు.
మూసీ ప్రక్షాళనలో భాగంగా ఇళ్లు కోల్పోతున్న వారితో కాకుండా రియల్ ఎస్టేట్ ప్రతినిధులు, ప్రపంచబ్యాంక్ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయడమేంటని కవిత అన్నారు. మూసీ ప్రక్షాళన జరగాలి.. కానీ అది ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలని ఆమె స్పష్టం చేశారు. మూసీ పరిరక్షణ అంటే అక్కడ ఆక్రమణలు జరగకుండా, వ్యర్థాలు మూసీలో కలవకుండా చూడాలని తెలిపారు.
వెలుగుమట్లలో పోరాటం కొనసాగుతుంది..
మరోవైపు వెలుగుమట్లలో ప్రభుత్వం 750 ఇళ్లను కూల్చేసి అందులో సగం మందికి కూడా న్యాయం చేయటం లేదని కవిత ఆరోపించారు. బాధితుల ఇళ్లు కూల్చిన తర్వాత తాను, విశారదన్ మహారాజ్ చేసిన నిరవధిక దీక్షతో ప్రభుత్వం స్పందించిన విషయాన్ని గుర్తుచేశారు. ఐతే 350 కుటుంబాలకు మాత్రమే పట్టాలు ఇస్తామని ప్రకటించి ఇప్పుడు వారిలో సగం మందికి కూడా ఇవ్వటం లేదని తమ దృష్టి వచ్చిందని చెప్పారు.
అదే విధంగా అక్కడున్న 31 ఎకరాలతో పాటు మరో 30 ఎకరాల భూదాన్ ల్యాండ్ ను ప్రభుత్వం పెద్దవాళ్లకు ఇచ్చే కుట్ర చేస్తుందన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఈ నెల 17 న ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేస్తామని చెప్పారు. వెలుగుమట్లలో బాధిత కుటుంబాల అందరికీ న్యాయం జరిగే వరకు వారికి ధర్మ సమాజ్ పార్టీ, జాగృతి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.


