Telangana
oi-Bomma Shivakumar
హైదరాబాద్ మహా నగరం దాదాపు 400 ఏళ్లకుపైగా చరిత్రను కలిగి ఉంది. కాకతీయులు, మెఘల్స్, కుతుబ్ షాహీలు, నిజాంలు ఈ ప్రాంతాన్ని పాలించారు. అనేక చారిత్రక కట్టడాలను ఇక్కడ నిర్మించారు. చార్మినార్, గోల్కొండ కోట, చౌమహల్లా ప్యాలెస్, కుతుబ్ షాహీ సమాధులు, మక్కా మసీదు, సాలార్ జంగ్ మ్యూజియం, పురానా హవేలీ.. తదితర కట్టడాలను నిర్మించారు. అయితే హైదరాబాద్ ను ఇప్పటికే చుట్టేసిన చాలా మంది నగర నగర వాసులు.. చుట్టు పక్కల ప్రాంతాల్లోని వాటర్ ఫాల్స్, డ్యామ్ లను చూడాలని అనుకుంటుంటారు. ఫ్యామిలీతో కలిసి వెళ్లేలా ప్లాన్ చేసుకుంటారు. ముఖ్యంగా వీకెండ్స్ లో అయితే మంది వీటిని సందర్శించడానికి వెళ్తుంటారు.
అయితే నాగార్జున సాగర్ వద్ద ఉన్న నాగార్జున కొండకు ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. చాలామంది నాగార్జున సాగర్ కు కేవలం డ్యామ్ ను చూసేందుకే వెళ్తుంటారు. కానీ నాగార్జున సాగర్ నిర్మాణం జరిగే సమయంలో నాగార్జున కొండ మునిగిపోయింది. నాగార్జున కొండ ప్రస్తుతం కృష్ణా నది మధ్యలో ఓ ద్వీపంలా ఉంది. ఇక్కడ 3- 4 శతాబ్దాల ఇక్ష్వాకుల వంశం నాటి బౌద్ధ, హిందూ అవశేషాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ మ్యూజియం, బౌద్ధ స్థూపాలు కూడా ఉన్నాయి. బౌద్ధ పండితుడు ఆచార్య నాగార్జున పేరు మీద ఈ కొండకు ‘నాగార్జునకొండ’ అని పేరు వచ్చింది. ఇక్కడికి నల్గొండ జిల్లాలోని విజయపురి సౌత్ నుండి బోటు ద్వారా చేరుకోవాలి.
నాగార్జున కొండపై మహాయాన బౌద్ధం, హిందూమతానికి సంబంధించిన ఆలయ అవశేషాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడి బౌద్ధ విశ్వ విద్యాలయాలు, అలాగే మఠాలలో చదువుకోవడానికి చైనా, గాంధార, బెంగాల్, శ్రీలంక నుంచి విద్యార్థులు వచ్చేందుకు ఆసక్తి చూపించేవారు. ఇక నాగార్జున కొండ గుంటూరు నుంచి దాదాపు 147 కి. మీ. దూరంలో ఉంటుంది. అలాగే హైదరాబాద్ నుంచి దాదాపు 166 కి. మీ. దూరంలో ఉంది. ఇక నాగార్జున కొండకు దగ్గరలో మాచర్ల రైల్వే స్టేషన్ ఉంది. ఈ రైల్వే స్టేషన్ దాదాపు 22 కి. మీ. దూరంలో ఉంది.
ఇక నాగార్జున సాగర్ ప్రపంచంలోకల్లా అతిపెద్ద మానవ నిర్మిత ప్రాజెక్టుగా ప్రసిద్ధి చెందింది. దాదాపు 45 వేల మంది కార్మికులు దాదాపు 12 ఏళ్ల పాటు శ్రమించి దీనిని నిర్మించారు. 1955 డిసెంబర్ 10న నాటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది. ఈ ప్రాజెక్ట్ భారతీయ ఇంజినీర్ల ప్రతిభకు నిలువెత్తు నిదర్శనంగా పేరొందింది.


