Telangana
oi-Dr Veena Srinivas
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ రెండో దశ విస్తరణ పై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో కీలక ప్రకటన చేశారు. 2026- 27 ఆర్థిక సంవత్సరానికి మూడు లక్షల 24 వేల 234 లక్షల కోట్ల బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెడుతూ, ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో మెట్రో కీలకపాత్ర పోషిస్తుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
మెట్రో రైలు ప్రాజెక్టుపై కీలక ప్రకటన చేసిన భట్టి విక్రమార్క
రాష్ట్ర రవాణా చరిత్రలోనే సాహసోపేతమైన నిర్ణయంగా తెలంగాణ ప్రభుత్వ అధీనంలోకి మెట్రో రైలు ప్రాజెక్టును తీసుకురావడం గురించి భట్టి విక్రమార్క మాట్లాడారు. ఎల్ అండ్ టి సంస్థ నుండి మెట్రో రైలు ప్రాజెక్టు తెలంగాణ ప్రభుత్వ అధీనంలోకి తీసుకు వస్తున్నట్టుగా తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రైలుకు రోజుకు దాదాపు 5 లక్షల మంది ప్రయాణికులకు తన సేవలు అందిస్తుంది అన్నారు.
పాతబస్తీకి మెట్రో సేవలను విస్తరించాలని లక్ష్యం
మెట్రో రెండో దశ కింద పాతబస్తీకి మెట్రో సేవలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుందని, కొత్త కారిడార్లను నిర్మించి, మొత్తం నెట్వర్క్ ని విస్తరించడం కోసం ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని అన్నారు. వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ అవసరాలను తీర్చడానికి మెట్రో రైల్ విస్తరణ కీలకంగా మారిందని ఆయన అన్నారు.
మెట్రో రైలు రెండవ దశ పనుల కోసం 600 కోట్లు
పాతబస్తీతోపాటు శంషాబాద్ విమానాశ్రయానికి, హైటెక్ సిటీ నుండి ఇతర ప్రాంతాలకు మెట్రో విస్తరణ అవసరమని పేర్కొన్న ఉపముఖ్యమంత్రి, మెట్రో రైలు రెండవ దశ పనుల కోసం 600 కోట్ల రూపాయలను కేటాయించినట్లు వెల్లడించారు. ఈ నిధులు మెట్రో ప్రాజెక్టు పనులకు ఊతమిస్తాయని భట్టి విక్రమార్క ఆశాభావం వ్యక్తం చేశారు.
76.4 కిలోమీటర్ల పొడవైన కొత్త మెట్రో మార్గం ఏర్పాటు
మొత్తం మెట్రో నిర్మాణానికి 24 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని పేర్కొన్న ఆయన ఈ భారీ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇతర అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాల రూపంలో సమీకరించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా తెలిపారు.హైదరాబాద్ రెండవ దశలో భాగంగా 76.4 కిలోమీటర్ల పొడవైన కొత్త మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలను రచిస్తుంది అన్నారు.
నగర పురోగతిలో, ప్రజల అవసరాలను తీర్చడంలో కీలకంగా మెట్రో
దీనికోసం ఇది కొత్త కారిడార్లను ప్రతిపాదించారు. హైదరాబాదు నగరాన్ని అంతర్జాతీయ నగరాలకు దీటుగా తీర్చిదిద్దడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గుర్తు చేశారు. హైదరాబాద్ నగర పురోగతిలో, ప్రజల అవసరాలను తీర్చడంలో మెట్రో కీలకంగా ఉంటుందన్నారు.


